ఓం రౌత్…. కలాం బయోపిక్ జాగ్రత్త !

ప్రభాస్ కెరీర్ లో ఎక్కువ విమర్శలు, క్రిటిసిజం ఎదురుకున్న సినిమాగా ఆదిపురుష్ గురించి మాట్లాడితే చాలు ఫ్యాన్స్ కి కోపం వచ్చేస్తుంది. రామాయణ గాధని దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన తీరు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనే తరహాలో సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. మొన్నీ మధ్య ఒక ఈవెంట్ లో ఆదిపురుష్ తెలుగు బిజినెస్ భారీ జరిగి ఎక్కువ శాతం ప్రేక్షకులు చూశారనే స్థాయిలో ఓం రౌత్ కవరింగ్ ఇచ్చుకోవడం మరిన్ని కామెంట్స్ కి చోటిచ్చింది. రావణుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఏనాడూ మాట్లాడలేనంత వీక్ గా కంటెంట్ నిరాశపరిచిందంటే ఏ స్థాయి డిజాస్టరో చెప్పాలా.

ఇదంతా గతం. ఇప్పుడు వర్తమానానికి వద్దాం. ఓం రౌత్ మరో బంపర్ ఆఫర్ కొట్టేశాడు. మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలాం బయోపిక్ తెరకెక్కించే అదృష్టాన్ని దక్కించుకున్నాడు. టి సిరీస్, ఏకె ఎంటర్ టైన్మెంట్స్, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ లాంటి భారీ నిర్మాణ సంస్థలు ఈ ప్యాన్ ఇండియా మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్నింటి కన్నా ప్రధాన ఆకర్షణ టైటిల్ రోల్ ధనుష్ పోషించనుండటం. ఇంకెవరో అయితే టెన్షన్ పడాల్సి వచ్చేదేమో కానీ ధనుష్ అంటే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఆశించవచ్చు. ఇవాళ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఫస్ట్ లుక్ కాదు కానీ ప్రీ లుక్ అయితే వచ్చేసింది.

మూవీ లవర్స్ ఓం రౌత్ ని ఒకటే కోరుకుంటున్నారు. ఆదిపురుష్ లాగా కాకుండా కలాంని అద్భుతంగా తీయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక మహనీయుడు, గొప్ప శాస్త్రవేత్త కథ కాబట్టి పది తరాలు గర్వంగా చెప్పుకునేలా ఉండాలని అడుగుతున్నారు. వాళ్ళ కోరిక సబబే. ఎందుకంటే అబ్దుల్ కలాం జీవితంలో ఎంతో స్ఫూర్తి ఉంది. గొప్ప పాఠాలు, యువత నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలున్నాయి. వాటిని అర్ధమయ్యే రీతిలో వక్రీకరించకుండా చెబితే మాస్టర్ పీసవుతుంది. ఓం రౌత్ ఇంతకు ముందు తీసిన తానాజీలో నిజాయితీని కలాం బయోపిక్ విషయంలోనూ చూపిస్తే చాలు. కంటెంట్ ప్లస్ కమర్షియల్ రెండిట్లోనూ వర్కౌటవుతుంది.