నిన్నటిదాకా ఖచ్చితంగా మే 30 వస్తామని చెప్పిన కింగ్ డమ్ వాయిదా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ పనులతో రీ రికార్డింగ్ కు సంబంధించిన వర్క్ అనిరుధ్ రవిచందర్ పూర్తి చేయాల్సి ఉండటంతో కొంత ఎక్కువ సమయమే పడుతుందట. ప్రస్తుతమైతే కంపోజింగ్ జరుగుతోంది. కానీ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. హిందీ బెల్ట్ లో థియేటర్ ఆక్యుపెన్సీలు పడిపోతున్నాయి. పబ్లిక్ ఎక్కువ ఉన్న చోట ఏదైనా జరగొచ్చనే భయంతో జనాలు అంత అర్జెంట్ కాని వినోదం వైపు మొగ్గు చూపడం లేదు.
ఇక హరిహర వీరమల్లు సైతం ఈ తేదీని వదిలేసుకుంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ లోనూ భారీగా రిలీజ్ చేయాలనేది నిర్మాత ఏఎం రత్నం ఆలోచన. కానీ వాతావరణం అంత సానుకూలంగా లేకపోవడంతో పాటు ప్రమోషన్లు, డబ్బింగ్ కు అవసరమైన సమయం చాలదు కాబట్టి జూన్ కు వెళ్లిపోయే ప్లానింగ్ జరుగుతోంది. ఇవి రావని నిర్ధారించుకున్న తర్వాతే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ భైరవంని మే 30 రిలీజ్ చేస్తామని అధికారిక ప్రకటన ఇచ్చేశారు. బడ్జెట్ పరంగా రిస్క్ లేని కంటెంట్, రీమేక్ మూవీ కావడంతో నిర్మాతలు ధీమాగా ఉన్నారు. టాక్ బాగుంటే జనాన్ని రప్పిస్తుంది.
సో మే 30ని విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్ లు వదులుకోవడం నష్టం కన్నా లాభమేనని చెప్పాలి. వచ్చే నెలకు కాశ్మీర్, ఢిల్లీలోని ఆందోళనలు తగ్గొచ్చు. పాకిస్థాన్ తోకముడిచే ఇరకాటంలో పడింది కాబట్టి యుద్ధం ఒక ముగింపుకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇదంతా లేకపోయి ఉంటే మే 30 చాలా మంచి డేట్ అయ్యేది. ఏదో ఒక పెద్ద సినిమాకు ఉపయోగపడేది. కానీ ఇప్పుడు రకరకాల కారణాల వల్ల వృథాగా పోతోంది. భైరవం కనక మంచి టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ వద్ద మాస్ సినిమా లేని లోటుని వాడుకుని గట్టెక్కేస్తుంది. కింగ్ డంలేదా వీరమల్లు వస్తుందనే ఉద్దేశంతో ఇతర నిర్మాతలు ఈ డేట్ ని వాడుకోలేకపోయారు.