టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్లలో ఒకడైన కృష్ణవంశీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. ఆయన తరం దర్శకుల్లో ట్విటర్ వాడేవాళ్లు తక్కువ. తర్వాతి తరం దర్శకులు ట్విట్టర్లో ఉన్నా అంత యాక్టివ్గా ఉండరు. కానీ కృష్ణవంశీ మాత్రం అభిమానులతో తరచుగా చిట్ చాట్లు చేస్తుంటారు. ఎవరైనా తనను ట్యాగ్ చేసి తన సినిమాల గురించి కామెంట్స్ చేసినా స్పందిస్తుంటారు. అనామకులకు, హార్ష్ కామెంట్లు చేసే వారికి కూడా ఆయన పద్ధతిగా సమాధానం ఇస్తుంటారు. తాజాగా కృష్ణవంశీ.. ట్విట్టర్ ఫ్యాన్స్తో చిట్ చాట్ చేశారు. అందులో వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఫటాఫట్ ఆన్సర్లు ఇచ్చారు. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఆయన చిట్ చాట్ విశేషాలు ఓసారి చూద్దాం.
కృష్ణవంశీ కెరీర్లో ‘ఖడ్గం’ చాలా స్పెషల్ ఫిలిం. దానికి సీక్వెల్ తీస్తారా అని ఓ అభిమాని అడిగితే.. ‘‘లేదండీ. అది సాధ్యం కాదు. క్షమించండి’’ అనేశారు కృష్ణవంశీ. ఆయన సీక్వెల్స్, రీమేక్, ఫ్రాంఛైజీ సినిమాలకు పూర్తి వ్యతిరేకమని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. ఐతే మీరు రీమేక్ చేయాల్సి వ్తే ‘నిన్నే పెళ్ళాడుతా’ను నాగచైతన్యతో రీమేక్ చేస్తారా అని.. అలాగే నాగచైతన్య-ఎన్టీఆర్లతో ‘గుండమ్మ కథ’ తీస్తారా అని అడిగితే.. ‘‘మంచి ఆలోచనే. 150 కోట్లు తీసుకుని వచ్చేయండి. దుల్లకొట్టేద్దాం’’ అంటూ షార్ప్గా కామెంట్ చేశారు కృష్ణవంశీ. మరోవైపు చిరంజీవితో ఎప్పట్నుంచో చేయాలనుకుంటున్న సినిమా సంగతి ఏమైంది అని అడిగితే.. ‘‘నాకు ఆ కోరిక ఉంది. ఎప్పట్నుంచో ఆయన్ని అడుగుతున్నాను. కానీ ఎందుకో కుదరడం లేదు. నా బ్యాడ్ లక్. ఐతే చిరంజీవితో ‘రుద్రవీణ’ లాంటి సినిమా తీసే సీన్ మాత్రం నాకు లేదు’’ అని బదులిచ్చారు.
చిరుతో ఆపద్బాంధవుడు లాంటి సినిమా తీయమని ఒక నెటిజన్ అడిగితే.. ఆ మాట చిరుకు మీరే చెప్పాలన్నారు కృష్ణవంశీ. జూనియర్ ఎన్టీఆర్తో ‘రైతు’ సినిమా ప్రపోజల్ ఏమైంది అని అడిగితే.. ‘‘ఆయన ఇప్పుడు జూనియర్ కాదండీ. ఇంటర్నేషనల్ రేంజ్. నేను ఆయనతో సరిపోను’’ అన్నారు. మంచి లవ్ స్టోరీ తీయొచ్చుగా అంటే.. ‘ఇప్పుడు లవ్ ఉందా’ అని ప్రశ్నించారాయన. మురారి లాంటి సినిమా తీయమంటే.. తనకు కాపీ చేయడం రాదని, ఇప్పుడు అలాంటి సినిమా కష్టమని తేల్చేశారు కృష్ణవంశీ. కాజల్తో సినిమా అంటే ఇప్పుడు ఒప్పుకుంటుందా అని సందేహం వ్యక్తం చేసిన కృష్ణవంశీ.. ఫ్యాన్స్ మాట్లాడితే ఓకే కావచ్చన్నారు. ఓటీటీ కంటెంట్ మీద ఆసక్తి లేదా అంటే.. ఇప్పుడు అదే రాస్తున్నట్లు కృష్ణవంశీ చెప్పారు.