సుకుమార్‌కు ఇంత కన్ఫ్యూజనేంటో?

సుకుమార్ తీసిన కొన్ని సినిమాలు జనాలకు అంత తేలిగ్గా అర్థం కావు. తన సినిమాల్లో కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులను బాగా కన్ఫ్యూజ్ చేస్తూ పజిల్స్ విసురుతుంటాడు సుక్కు. ఐతే సినిమాలు తీసే విషయంలోనూ సుకుమార్ పెద్ద కన్ఫ్యూజన్ మాస్టర్ అని అంటుంటారు. ఏదీ ఒక పట్టాన ఓకే చేయకపోవడం, ఎప్పటకిప్పుడు మార్పులు చేస్తూ ఉండటం.. సెట్స్‌లోకి వెళ్లాక కూడా మార్పులు చేర్పులు చేయడం సుకుమార్‌కు అలవాటని ఆయన్ని ఎరిగిన వాళ్లందరికీ తెలుసు.

స్క్రిప్టు విషయంలోనే కాదు.. ఆర్టిస్టుల విషయంలోనూ ఆయన ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. చివరి నిమిషం వరకు మార్పులు జరుగుతూ ఉంటాయి. తన కొత్త సినిమా ‘పుష్ప’ విషయానికొచ్చేసరికి ఈ మార్పులు, కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువ అయిపోయినట్లు యూనిట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఏడాది ముందు మొదలవ్వాల్సిన ‘పుష్ప’ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లలేదు. కరోనా మాత్రమే కాదు.. అనేక కారణాలున్నాయి ఇందుకు. ఎట్టకేలకు మారేడుమిల్లి, వైజాగ్ పరిసరాల్లో షెడ్యూల్ మొదలుపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 10న షూటింగ్ అంటున్నారు. ఐతే ఇప్పటికీ ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎవరన్నది ఖరారవ్వలేదు. మిగతా పాత్రల విషయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఆర్టిస్టులు చాలా వరకు ఫైనలైజ్ అయిపోయారు. కానీ విలన్ సంగతి మాత్రం తేలలేదు.

విజయ్ సేతుపతి దగ్గర మొదలై చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. సేతుపతి అయితే పర్ఫెక్ట్ అనుకున్నారు కానీ.. అతను డేట్లు సర్దుబాటు చేయలేక తప్పుకున్నాడు. తర్వాత అరవింద్ స్వామి, బాబీ సింహా, నారా రోహిత్.. ఇలా ఏవేవో పేర్లు వినిపించాయి. తాజాగా ఈ పాన్ ఇండియా సినిమాను హిందీలో సేల్ చేయడం కోసం బాబీ డియోల్‌ను ఆ పాత్రకు తీసుకుంటే ఎలా ఉంటుందని సుక్కు యోచిస్తున్నాడట. కానీ ఎవరినీ ఇప్పటిదాకా ఓకే చేయలేదు. ఈ కన్ఫ్యూజన్ వల్ల మెయిన్ విలన్ లేకుండానే షూటింగ్ మొదలుపెట్టేస్తున్నాడు. తొలి రెండు షెడ్యూళ్లు విలన్ లేకుండానే కానిచ్చేస్తారట. ఆలోపు ఒక పేరు ఖరారు చేసి తర్వాతి షెడ్యూల్‌కు రప్పిస్తారట.