ఆదిపురుష్ దర్శకుడి విచిత్ర వాదం

కొందరు దర్శకులకు తాము తీసింది ఫ్లాపని ఒప్పుకోవాలంటే మహా కష్టంగా అనిపిస్తుంది. ఏదో ఒక సాకు చెప్పి తాము తీసింది మంచి సినిమాని చెప్పుకునే తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ ఈ క్యాటగిరీలోకే వస్తాడు. తాజాగా జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ లో పాల్గొన్న ఇతను ఒక కొత్త భాష్యం చెప్పాడు. ఈ సినిమా తెలుగు హక్కులు 120 కోట్లకు అమ్ముడుపోయాయని, అంటే ఎక్కువ శాతం ప్రజలు చూశారని, ఒక మేకర్ అధికంగా రీచ్ తెచ్చుకోవడమే కోరుకుంటాడని, ఆ రకంగా తన లక్ష్యం నెరవేరినట్టేననే కవర్ చేసుకోవడం చూసి ప్రభాస్ అభిమానులకు నోటమాట రావడం లేదు.

ఎందుకంటే ఇదే ఆదిపురుష్ గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో  సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ కొడుక్కు ఈ సినిమా చూపించాక క్షమాపణ అడిగానని, వాడు చూసిన లుక్కు అలా ఉందని, తర్వాత తన సారీని అంగీకరించాడని చెప్పుకొచ్చాడు. అంటే రావణుడిగా అంత గొప్ప పాత్ర దక్కిన సైఫ్ నోటి వెంటే ఈ మాట వచ్చిందంటే అది ఎంత దారుణంగా డిజైన్ చేయబడిందో వేరే చెప్పాలా. దానికి పూర్తి బాధ్యత ఓం రౌత్ దే కదా. ఇదొక్కటే కాదు రిలీజైన టైంలో కంటెంట్ గురించి బోలెడు విమర్శలు వచ్చాయి. డబ్బుల సంగతి ఏమో కానీ రామాయణాన్ని ఇంత బ్యాడ్ గా చూపిస్తారా అంటూ హిందూ వర్గాలు ఓం రౌత్ మీద భగ్గుమన్నాయి.

ఆయన చెప్పిన లెక్కన ఒక సినిమా భారీ రేటుకు అమ్ముడుపోతే అది డిజాస్టర్ అయినా సరే హిట్టయ్యిందని ఒప్పుకోవాలన్న మాట. లాజిక్ అదిరిపోయింది కదూ. అసలు ఆదిపురుష్ దెబ్బకే ఓం రౌత్ ఇప్పటిదాకా కొత్త సినిమా సెట్ చేసుకోలేదు. ఒక ప్యాన్ ఇండియా మూవీ ప్రతిపాదనలో ఉంది కానీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. నిజంగా ఆదిపురుష్ కనక సరిగ్గా తీసి ఉంటే రన్బీర్ కపూర్ తో నితీశ్ తివారి ఇంకో రామాయణం తీసే సాహసం చేసేవారు కాదేమో. మీకు చేత కాలేదు నేను చేసి చూపిస్తాననే తరహాలో ఆయన తెరకెక్కిస్తున్న వైనం మీడియాలో హాట్ టాపిక్ గా ఉంది. ఓం రౌత్ వరస చూస్తుంటే మరోసారి ప్రభాస్ కం టు మై రూమ్ అనాలేమో.