‘ఆచార్య’ రచ్చ.. చరణ్ లైన్లోకొచ్చాడు


టాలీవుడ్లో పేరున్న సినిమాలన్నీ ఒకదాని తర్వాత షూటింగ్‌కు వెళ్తుంటే.. కరోనా విజృంభిస్తున్న సమయంలోనే షూటింగ్‌లు జరపాలని ప్రయత్నించిన మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాన్ని ఎంతకీ పున:ప్రారంభించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ఎంతకీ ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లలేదు. నవంబరు 4న షూటింగ్ అన్నారు కానీ.. అది కూడా కార్యరూపం దాల్చలేదు.

స్క్రిప్టులో మార్పులంటూ మీడియాలో గట్టిగా ప్రచారం జరగడంతో ఇంతకుముందు జరిగిన ‘కాపీ’ వివాదమే ఇందుక్కారణమా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలోనూ రచ్చ నడుస్తుండటంతో ఇది డ్యామేజింగ్ అనుకున్నారో ఏమో.. వెంటనే షూటింగ్ అప్‌డేట్ ఇచ్చేశారు. రామ్ చరణ్ అధినేతగా వ్యవహరిస్తున్న కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్లో ఈ మేరకు ప్రకటన చేసింది.

నవంబరు 9న ఆచార్య కొత్త షెడ్యూల్ మొదలు కాబోతున్నట్లు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్టర్లో ప్రకటించింది. అన్ని జాగ్రత్తల మధ్య షూటింగ్ జరగబోతోందని.. ఇది సుదీర్ఘ షెడ్యూల్ అని, ఇందులోనే సినిమాలో మేజర్ పోెర్షన్స్ పూర్తవుతాయని కూడా వెల్లడించి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. అలాగే 2021 వేసవిలో ‘ఆచార్య’ సందడి చేయబోతున్న విషయాన్ని కూడా మరోసారి ధ్రువీకరించారు.

ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న అప్‌డేట్ ఎట్టకేలకు రావడంతో మెగా అభిమానులు హమ్మయ్య అనుకుంటున్నారు. ఇక ‘ఆచార్య’ గురించి జరుగుతున్న నెగెటివ్ ప్రచారాలన్నింటికీ ఇంతటితో తెరపడ్డట్లే అనుకోవాలి. ‘ఆచార్య’లో చిరు సరసన కాజల్ నటించనున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బేనర్‌తో కలిసి చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. చిరు నిర్విరామంగా పని చేసి ఈ సినిమాను ఈ ఏడాదే పూర్తి చేసేస్తాడని.. కొత్త ఏడాదిలో సమాంతరంగా లూసిఫర్, వేదాలం రీమేక్‌ల్లో నటిస్తాడని అంటున్నారు.