అసలు ప్రచార ఆర్భాటం లేదు. విడుదల తేదీని హఠాత్తుగా నిర్ణయించుకున్నారు. ఎల్2 ఎంపురాన్ లాగా హీరో మోహన్ లాల్ దర్శకుడిని, టీమ్ ని వెంటేసుకుని దేశమంతా తిరగలేదు. కనీసం రెండు మూడు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు. నటించాను అయిపోయిందనే తరహాలో తుడరుమ్ ని వదిలేశారు. ఆడితే ఆడింది లేదంటే లేదనే తరహాలో మౌనంగా ఉండిపోయారు. కట్ చేస్తే ఇంకా వారం కాకుండానే వంద కోట్ల వైపు పరుగులు పెడుతున్న తుడరుమ్ ని చూసి ట్రేడ్ ఆశ్చర్యపోతోంది. కేరళలో రిలీజ్ డేట్ నుంచి దాదాపుగా హౌస్ ఫుల్స్ పడుతూనే ఉన్నాయి. ప్రమోషన్లు లేకపోయినా మతిపోయే నెంబర్లు వస్తున్నాయి.
కాన్సెప్ట్ పరంగా కొంచెం దృశ్యంకి దగ్గరగా అనిపించినా తుడరుమ్ ది వేరే ప్రపంచం. ఓపెన్ గా చెప్పాలంటే దర్శకుడు తరుణ్ మూర్తి మన రంగస్థలంలోని క్లైమాక్స్ ట్విస్టుని తీసుకుని దాన్ని హీరో ఫ్యామిలీకి జోడించి పోలీసులను విలన్లుగా చూపించాడు అంతే. కాకపోతే స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉండటం, ప్రీ ఇంటర్వెల్ నుంచి బోర్ కొట్టడమనే ప్రశ్నే రాకుండా కథనాన్ని పరుగులు పెట్టించడం ఆడియన్స్ ని మెప్పిస్తోంది. జెక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దానికి మరింత దోహదం చేసింది. తెలుగు డబ్బింగ్ హడావిడిగా వదిలినా కూడా కొన్ని చోట్ల మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్న వైనం ట్రేడ్ వర్గాల్లో కనిపిస్తోంది.
జింఖానా తరహాలో తుడరుమ్ కి కొంచెం హడావిడి చేసి ఉంటే ఓపెనింగ్స్, టాక్ రెండూ పెరిగేవి. ఏది ఏమైనా విజువల్ గ్రాండియర్స్, ప్యాన్ ఇండియా మూవీస్ అంటూ రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేస్తున్న కొందరు స్టార్లకు మోహన్ లాల్ మోడల్ గా నిలుస్తున్నారు. ఎల్2 లాంటి పెద్ద బడ్జెట్ లు, తుడరుమ్ లాంటి చిన్న చిత్రాలు రెండూ ఒకేసారి చేయడం ద్వారా బ్యాలన్స్ అంటే ఏంటో నిరూపిస్తున్నారు. ప్రస్తుతం 70 కోట్లు దాటేసిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ వీకెండ్ రాకుండానే సెంచరీ దాటడం ఖాయం. ఇప్పుడీ స్పందన చూసి తుడరుమ్ రెండో భాగానికి రెడీ అవుతున్నారట. అంటే ఇదో కొత్త ఫ్రాంచైజ్ కాబోతోంది.