వేణు మీద ఈసారి బరువైన బాధ్యతలున్నాయి

బలగం రూపంలో తక్కువ బడ్జెట్ తో పెద్ద హిట్టు అందుకుని దర్శకుడిగా తన టాలెంట్ ఋజువు చేసుకున్న కమెడియన్ వేణు యెల్దండి రెండో సినిమాకు కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు. స్టార్ హీరో కావాలనే పంతంతో నిర్మాత దిల్ రాజుని కన్విన్స్ చేసి ఫైనల్ గా ఎల్లమ్మని లాక్ చేసుకున్నాడు. నిజానికిది నానితో ప్లాన్ చేసుకున్నది. తనకది బాగా నచ్చింది కూడా. అయితే హిట్ 3, ప్యారడైజ్ రెండూ ఇంటెన్స్ డ్రామాలే కాబట్టి మూడోది కూడా అదే జానర్ లో చేస్తే ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా ఇబ్బందవుతుందని భావించిన నాని దీన్ని వద్దనుకున్నట్టు టాక్ ఉంది. ఏదైతేనేం నితిన్ రూపంలో వేణు మరో మంచి ఛాయస్ అందుకున్నాడు.

ఇదిలా ఉండగా ఎల్లమ్మ కథ వెనుకబడిన కులానికి చెందిన ఒక గాయకుల బృందం చుట్టూ తిరుగుతుందట. వాళ్ళ కలలు, పోరాటాలు, సమాజంలో అవమానాలు, ఎదురుకుని తట్టుకుని గెలిచిన వైనాలు ఇవన్నీ చాలా ఎమోషనల్ గా చూపించబోతున్నట్టు సమాచారం. ఎల్లమ్మ అనే గ్రామదేవత ఎలిమెంట్ కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. జానపద కళాకారుల బ్యాక్ డ్రాప్ లో క్లైమాక్స్ లాంటి కీలక ఘట్టాలు ఎమోషనల్ గా డిజైన్ చేసుకున్నట్టుగా చెబుతున్నారు. హీరోయిన్ గా సాయిపల్లవిని తొలుత సంప్రదించారు కానీ ఇటీవలే కీర్తి సురేష్ కు కూడా నెరేషన్ అయ్యిందట. ఈ ఇద్దరిలో ఎవరనేది త్వరలోనే ప్రకటించవచ్చు.

వేణు మీద ఈసారి బరువైన బాధ్యతలున్నాయి. ఒకటి తనను ఇంత నమ్మి కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టేందుకు ముందుకు వచ్చిన దిల్ రాజుని నిరాశపరచకుండా బెస్ట్ ఇవ్వడం. రెండోది వరస డిజాస్టర్లలో ఉన్న నితిన్ కు పెద్ద బ్లాక్ బస్టర్ ఇవ్వడం. మూడోది బలగం లాగా ఇందులో చిన్న క్యాస్టింగ్ లేదు కాబట్టి తనకు ఎంత కాన్వాస్ ఇచ్చినా మంచి సినిమా ఇస్తాననే భరోసాని ఇతర నిర్మాతలకు కలిగించడం. రెండేళ్లుగా ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్న వేణు యెల్దండి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే ఉంటాడు. దిల్ రాజు నిర్మిస్తున్న నితిన్ మరో సినిమా తమ్ముడు రిలీజ్ కాగానే ఎల్లమ్మ తాలూకు పనులు వేగవంతం కాబోతున్నాయి.