ఎన్టీఆర్ నీల్ – సంక్రాంతి కాదు సమ్మర్ తర్వాత

రెండు మూడేళ్ళకు ఒకసారి తెరమీద కనిపించే స్టార్ హీరోల ప్యాన్ ఇండియా మూవీ అప్డేట్లు ఏవైనా సరే అభిమానుల్లో విపరీతమైన ఉద్వేగాన్ని రేపుతాయి. దానికి అనుగుణంగానే దర్శక నిర్మాతలు సరైన కంటెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఆనందం తీరడమే కాదు సోషల్ మీడియా రూపంలో వాటికి విపరీతమైన రీచ్ తెచ్చే బాధ్యత తీసుకుంటారు. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా గురించి ఒక అప్డేట్ ఇస్తామంటూ ముందు రోజు తెగ ఊరించి తీరా చూస్తే తారక్ షూటింగ్ సెట్లో అడుగు పెట్టబోతున్నట్టు చప్పని కబురు చల్లగా చెప్పారు. కెమెరా ముందుకు హీరో రావడం ఏ రకంగా క్రేజీ ఇన్ఫో అవుతుందో ఫ్యాన్స్ కే అర్థం కాలేదు.

అయితే ఆ అసంతృప్తిని పూర్తిగా తొలగించేలా ఇవాళ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. ముందు అనుకున్నట్టు 2026 సంక్రాంతికి కాకుండా జూన్ 25 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్ గా చెప్పేశారు. నిజంగానే ఇది సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ సెట్స్ లో అడుగు పెట్టాడు. తనది ఒక్క షెడ్యూల్ అవ్వకుండానే డేట్ నిర్ణయం తీసుకోవడం అనూహ్యం. కాకపోతే వేసవి అయిపోయి స్కూళ్ళు, కాలేజీలు తెరిచాక ఎన్టీఆర్ నీల్ రావడమనేది కొంత రిస్క్ గా ఫీలవుతున్నారు ఫ్యాన్స్. కానీ ఇలాంటి క్రేజీ మూవీస్ కి టెన్షన్ అక్కర్లేదు. సినిమా బాగుంటే అన్ సీజన్ లోనూ ఆడేస్తాయి.

ఉదాహరణకు బాహుబలి 1 ది బిగినింగ్ తీసుకుంటే అది వచ్చింది జూలై 10. కానీ రికార్డులు మొత్తం గల్లంతు చేసేసింది. ఇలా చాలా ఉదాహరణలున్నాయి. డ్రాగన్ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో దర్శకుడు ప్రశాంత్ నీల్ షాకింగ్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నట్టు టాక్ ఉంది. తారక్ కివ్వబోయే ఎలివేషన్లు కెజిఎఫ్ కి నాలుగైదింతలు ఎక్కువగా ఉంటాయని టీమ్ సభ్యులు ఆఫ్ ది రికార్డు ఊరిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఇంటెన్స్ డ్రామాకు రవి బస్రూర్ సంగీతం ప్రధాన ఆకర్షణ కాబోతోంది. సో ఇప్పటి నుంచి లెక్కేస్తే ఇంకో 14 నెలల్లో ఎన్టీఆర్ నీల్ వెండితెర మీద రచ్చ చేయబోతున్నారు.