కెరీర్ మొత్తం మీద రెండే రెండు చెప్పుకోదగ్గ సినిమాలున్నాయి. అవి బిచ్చగాడు, బిచ్చగాడు 2. ఇవి తప్ప ఇతర భాషల్లో కనీసం యావరేజ్ అనిపించుకున్నవి ఒక్కటి కూడా లేవు. కెరీర్ దశాబ్దం దాటుతున్నా ఇంత ఫెయిల్యూర్ రేట్ తో బిజీగా ఉండటం మాములు విషయం కాదు. ఇదంతా ఎవరి గురించో అర్థమయ్యిందిగా. ఇక అసలు మ్యాటర్ చూద్దాం. ఇటీవలే పెహల్గామ్ లో జరిగిన దుర్ఘటనని ఉద్దేశించి నిన్న విజయ్ ఆంటోనీ ఒక ట్వీట్ చేశాడు. పాకిస్థాన్ లో 50 లక్షల భారతీయుల గురించి మనం ఆలోచించాలని, వాళ్ళు శాంతి, సంతోషాన్ని కోరుకుంటున్నారని, ఇన్ డైరెక్ట్ గా ప్రభుత్వ తీవ్ర చర్యలు వద్దనే రీతిలో సందేశం ఇచ్చాడు.
దీంతో ఒక్కసారిగా నెటిజెన్లు భగ్గుమన్నారు. అంటే శత్రుదేశం ఎంత మంది అమాయకులను చంపినా పాక్ లో ఇండియన్స్ ఉన్నారు కాబట్టి ఏం చేయకుండా వదిలేయాలా అంటూ నిలదీయడం మొదలుపెట్టారు. అసలు యాభై లక్షల మంది ఉన్నారని మీకెలా తెలుసు, ఏదైనా డేటా ఉంటే సాక్ష్యంగా చూపించమని రివర్స్ ఎటాక్ చేశారు. దీంతో జరిగిన తప్పు గుర్తించిన విజయ్ ఆంటోనీ వెంటనే దిద్దుబాటు మొదలెట్టాడు. ఇవాళ పెట్టిన కొత్త ట్వీట్ లో కేంద్ర ప్రభుత్వంతో పాటు మనమంతా బలమైన చేతులతో టెర్రరిస్టుల అంతం చూడాలని, మన ఐక్యతను దెబ్బ తీసే వాళ్ళ ప్రయత్నాలను భగ్నం చేయాలని కొత్తరాగం అందుకున్నాడు.
ఇదేదో ముందే చెబితే ఈ తలనెప్పి వచ్చేది కాదు. పాకిస్థాన్ లోనే కాదు ఆఫ్ఘానిస్తాన్ లో కూడా భారతీయులు ఉంటారు. అంతమాత్రాన ఎవరైనా మనల్ని దారుణంగా కవ్వించి, కన్నీళ్లు వచ్చేలా చేస్తే చేతులు ముడుచుకుని కూర్చోలేం కదా. విజయ్ ఆంటోనీ ఉద్దేశం ఏదైనా ముందు పెట్టిన ట్విట్ లో అవసరం లేని భయాన్ని సూచించింది. అయినా ఊరందరిది ఒక దారి ఉలిపిరి కట్టెది ఒక దారి అన్నట్టు కోట్లాది మంది ఇది తప్పని చెబుతున్నప్పుడు ఫలానా పని చేయకండి అక్కడ మనోళ్లు ఉన్నారని చెప్పడం ముమ్మాటికీ తప్పే. తనను అపార్థం చేసుకున్నారని అంటున్నాడు కానీ జనాలు మాత్రం స్పష్టంగానే అర్థం చేసుకున్నట్టున్నారు.