క్రిష్ వ‌దిలేసిందీ అంతే… ప‌ట్టుకున్న‌ది అంతే

టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు జాగ‌ర్ల‌మూడి క్రిష్‌. త‌న తొలి చిత్రం గ‌మ్యం ఎంత సంచ‌ల‌నం రేపిందో తెలిసిందే. ఆ త‌ర్వాత వేదం, కృష్ణం వందే జ‌గద్గురుం, కంచె లాంటి మంచి సినిమాలు తీశాడాయ‌న‌. కాక‌పోతే ఆయ‌న కెరీర్లో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌లు త‌క్కువ‌. అయినా స‌రే ఎప్ప‌టిక‌ప్పుడు ఆస‌క్తిక‌ర ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ బిజీగానే క‌నిపించేవాడు. కానీ య‌న్.టి.ఆర్ సినిమాతో ఆయ‌న కెరీర్ తిర‌గ‌బ‌డింది. ఆ సినిమా క్రిష్ పేరును దెబ్బ తీసింది. దీంతో కెరీర్లో గ్యాప్ త‌ప్ప‌లేదు. ఐతే ఆ గ్యాప్ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రాన్నిప్ర‌క‌టించ‌డంతో క్రిష్ పేరు మ‌ళ్లీ మార్మోగింది.

ఐతే క్రిష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌నుకున్న సినిమా కాస్తా.. చివ‌రికి ఆయ‌న చేజారింది. విప‌రీతంగా ఆల‌స్యం అవుతుండ‌డంతో క్రిష్ ఆ చిత్రం నుంచి త‌ప్పుకున్నాడు. జ్యోతికృష్ణ ద‌ర్శ‌కుడి పాత్ర‌లోకి మారాడు. కానీ అత‌నొచ్చాక కూడా సినిమా ముందుకు క‌ద‌ల‌ట్లేదు. వీర‌మ‌ల్లు ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది.
క‌ట్ చేస్తే క్రిష్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లును వ‌దిలేశాక అనుష్క‌తో ఘాటి అనే ఇంట్రెస్టింగ్ మూవీని మొద‌లుపెట్టాడు. ఈ సినిమా ప్రోమోలు భ‌లేగా అనిపించాయి.

ఒక‌ప్ప‌టి సినిమాల త‌ర‌హాలోనే చ‌క‌చకా షూట్ చేస్తూ రిలీజ్‌కు రెడీ చేయాల‌ని చూశాడు క్రిష్‌. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు కంటే ముందు ఇదే రిలీజ‌య్యేలా క‌నిపించింది. ఏప్రిల్ 18కి డేట్ ఇచ్చారు. కానీ తీరా ఆ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డేస‌రికి ఆ చిత్రం అతీగ‌తీ లేకుండా పోయింది. కొన్ని నెల‌లుగా ఘాటి గురించి చ‌ర్చే లేదు. షూటింగ్ ఏమైందో, రిలీజ్ ఎప్పుడో ఏ స‌మాచారం లేదు. తెర‌పై క్రిష్ వ‌ర్క్ చూద్దామ‌ని ఎదురు చూస్తున్న వాళ్ల‌కు నిరాశ త‌ప్ప‌ట్లేదు. అటు వీర‌మ‌ల్లు రిలీజ్ కాకుండా ఆగిపోయి.. ఇటు ఘాటి సంగ‌తి కూడా అయోమ‌యంగా త‌యారై క్రిష్ ప‌రిస్థితి రెంటికీ చెడ్డ‌ట్లు త‌యారైంది. ఎంతో విష‌యం ఉన్న ద‌ర్శ‌కుడు కెరీర్‌ను ఇలా దెబ్బ తీసుకుంటున్నాడేంటి అని ఆయ‌న ఫ్యాన్స్ ఫీల‌వుతున్నారు. ఘాటి గురించి వీలైనంత త్వ‌ర‌గా అప్‌డేట్ ఇవ్వాల‌ని వారు కోరుకుంటున్నారు.