3 ఫ్లాపులు…3 హీరోలు…జూలై పరీక్ష

ఏ హీరోకైనా ఒక డిజాస్టర్ తర్వాత వచ్చే సినిమా మీద చాలా ఒత్తిడి ఉంటుంది. దాని కోసమే దర్శక నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా అన్నీ కుదిరాయి అనుకున్నాకే ప్రమోషన్లు మొదలుపెడతారు. వచ్చే జూలై నెల ముగ్గురు హీరోలకు చాలా కీలకం కానుంది. అదేంటో చూద్దాం. భోళా శంకర్ ఫలితం చిరంజీవికి చాలా చేటు చేసింది. కంటెంట్ బాలేకపోవడం వేరే సంగతి. అసలాయన స్థాయికి తగ్గట్టు కాకుండా నేలబారు కథా కథనాలతో మెగాస్టార్ ని ట్రోలింగ్ బారిన పడేలా చేశారనేది అభిమానుల ప్రధాన కంప్లయింట్.

దీని దెబ్బకే ముందు అనుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టు క్యాన్సిల్ చేసి ‘విశ్వంభర’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. ఇది షూటింగ్ నుంచి టీజర్ దాకా పురిటినొప్పులు చాలానే పడుతోంది. రిలీజ్ డేట్ వాయిదాలు జరిగాయి. విఎఫెక్స్ మీద వచ్చిన నెగటివిటీ దెబ్బకు మొత్తం టీమ్ మార్చేసి సరిచేయడానికి డెబ్భై కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. దర్శకుడు వసిష్ఠకు సైతం ఇది కీలకమైన ప్రాజెక్టు. జూలై 24 విడుదల దాదాపు ఖరారైనట్టే. ఇక వరస పరాజయాలతో ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేస్తున్న రవితేజ ‘మాస్ జాతర’తో జూలై 18 రావొచ్చనే లీక్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపుతోంది.

ధమాకా తర్వాత సోలో హీరోగా ఒక్క హిట్టు లేని రవితేజకు మాస్ జాతర పునఃవైభవం తెస్తుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. రచయితగా మాస్, ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్ మీద చాలా పట్టున్న రచయిత భాను భోగవరపు దీంతోనే డైరెక్టర్ గా డెబ్యూ చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్, భీమ్స్ సంగీతం లాంటి ఆకర్షణలు బోలెడున్నాయి. ఇక వీళ్ళ కన్నా ముందు నితిన్ ‘తమ్ముడు’ జూలై 4 రావొచ్చనేది ఫ్రెష్ అప్డేట్. చిరంజీవి, రవితేజ కన్నా ఎక్కువ ఫెయిల్యూర్స్ నితిన్ కున్నాయి. సో దర్శకుడు వేణు శ్రీరామ్ తనను ఎలా చూపించాడనేది తెరమీద చూడాలి. దిల్ రాజు నిర్మాణం కాబట్టి బడ్జెట్ పరంగా ఢోకా లేదు. మరి ముగ్గురు హీరోలకు కఠిన పరీక్ష పెట్టబోతున్న జూలై కోరుకున్నట్టే సక్సెస్ ఇస్తే మాత్రం అభిమానులకే కాదు ఇండస్ట్రీకీ మంచిది.