కమర్షియల్ గా ఫ్లాప్ అవ్వొచ్చేమో కానీ ఖలేజాకు తర్వాతి కాలంలో కల్ట్ ఫాలోయింగ్ దక్కింది. ముఖ్యంగా టీవీ ఛానల్స్, ఓటిటిలో వచ్చాక రిపీట్ రన్ లో చూసే అభిమానులతో పాటు బోలెడు ప్రేక్షకులు దీనికి సొంతమయ్యారు. మహేష్ బాబు కామెడీ టైమింగ్ తో పాటు పలు వేరియేషన్లను పూర్తిగా రాబట్టుకున్న దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వంద మార్కులు సాధించారు. అయితే ఫస్ట్ హాఫ్ సాగతీత, విలన్ కు సంబంధించిన ఎస్టాబ్లిష్ మెంట్ సరిగా లేకపోవడంతో జనానికి కనెక్ట్ కాలేకపోయింది. ముఖ్యమైన ఎడిటింగ్ లోపాన్ని గుర్తించిన వాళ్ళు చాలా తక్కువ. తాజాగా వాటి గురించి కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ ఓపెనయ్యాడు.
మీకు ఇష్టమైన నేను డైరెక్ట్ చేసి ఉంటే బాగుండేదని ఫీలైన సినిమాలేవీ అని అడిగిన ప్రశ్నకు బదులు చెబుతూ డైరెక్షన్ ఏమో కానీ ఎడిటింగ్ అయితే ఖలేజాని బాగా చేసి ఉండేవాడిననే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతే ఒక్కసారిగా అక్కడ వింటున్న వాళ్ళనుంచి చప్పట్లు భారీ ఎత్తున వినిపించాయి. ఇదొక్కటే కాదు డియర్ కామ్రేడ్ సైతం తన ఎడిటింగ్ లిస్టులో పొందుపరిచాడు నాగ్ అశ్విన్. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబోలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో పాటలు ఎంత బాగున్నా నిడివి, సుధీర్ఘమైన ఎమోషన్లను ప్రెజెంట్ చేసిన విధానం ఆడియన్స్ ని మెప్పించలేక ఫెయిల్యూర్ గా మిగిలింది.
చిత్రోత్సవ్ ఫిలిం ఫెస్టివల్ 2025 సందర్భంగా మా ప్రతినిధితో జరిపిన ప్రత్యేక ముఖాముఖీలో నాగ్ అశ్విన్ బోలెడు కబుర్లు పంచుకున్నాడు. కల్కిలో ఒక్కో సీన్ కోసం నెలలు సంవత్సరాలు ఎలా గడిపింది, దాని విస్తరణ చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయనేది, మారుతీ కారులో తిరిగే తన సింప్లిసిటీ, ఏఐ టెక్నాలజీ ప్రభావం ఇలా బోలెడు ముచ్చట్లు అందులో చర్చకు వచ్చాయి. కల్కి 2 కొంత ఆలస్యమయ్యేలా ఉన్న బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తానని చెబుతున్న నాగ్ అశ్విన్ నుంచి ప్రభాస్ అభిమానులు చాలా ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టే స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం.