షారుఖ్ ఇంద్రభవనంలోకి అభిమానులు

ఇండియాలో అత్యంత విలాసవంతమైన ఇంటిని నిర్మించుకున్న ఫిలిం సెలబ్రెటీల్లో ముందు వరుసలో ఉండే పేరు షారుఖ్ ఖాన్‌దే. ముంబయిలోని ఖరీదైన ప్రాంతంలో ఇంద్ర భవనాన్ని తలపించేలా భారీ భవంతిని కట్టుకున్నాడు షారుఖ్. దానికి ‘మన్నత్’ అని పేరు పెట్టుకున్నాడు. కొన్నేళ్ల కిందటే దాని విలువ రూ.200 కోట్లుగా రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేశారంటే అదెంత విలాసవంతంగా, భారీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అప్పుడప్పుడూ షారుఖ్ భార్యా పిల్లలతో ఇంటి లోపల తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతుంటే నోరెళ్లబెట్టి చూస్తుంటారు అభిమానులు. ఎదురుగా సముద్రం కనిపించేలా షారుఖ్ కట్టుకున్న ఈ ఇంటిని బయటి నుంచి చూసేందుకే వేలాదిగా అభిమానులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా షారుఖ్ పుట్టిన రోజు అయిన నవంబరు 2న ‘మన్నత్’ ఉన్న రోడ్డులో ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు.

ఐతే వాళ్లందరినీ ఈసారి తన ఇంటిలోకి తీసుకెళ్లాలని షారుఖ్ నిర్ణయించుకున్నాడు. మరి వేలాది మంది అభిమానులు ఇంటి లోపలికి వెళ్తే ఇల్లు గుల్లయిపోదూ అనే సందేహం కలగొచ్చు. ఐతే ఇక్కడే ఓ మతలబు ఉంది. షారుఖ్ ఇంట్లోకి అడుగు పెట్టకుండానే ఆ ఇంట్లో ఉన్న అనుభూతిని అభిమానులు పొందేలా షారుఖ్ ఓ ఏర్పాటు చేస్తున్నాడు. తన ‘మన్నత్’లో అడుగడుగూ తిరుగుతూ అతను వర్చువల్ రియాలిటీ వీడియోను సిద్ధం చేస్తున్నాడు. దాన్ని తన పుట్టిన రోజు నాడు అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటాడు.

వీఆర్ ఎక్విప్మెంట్ పెట్టుకుని ఆ వీడియో చూస్తే షారుఖ్ ఇంటిలోకి వెళ్లి అంతా చూస్తున్న అనుభూతి కలుగుతుంది అభిమానులకు. ఈ విషయం తెలిసి షారుఖ్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. ఇటీవల ట్విట్టర్లో అభిమానులతో షారుక్ ముచ్చటించినపుడు.. ఒక వ్యక్తి ‘మన్నత్’ను అమ్మే ఉద్దేశాలేమైనా ఉన్నాయా అని అడిగితే.. ‘మన్నత్’ అంటే ప్రార్థనకు సంబంధిందని.. దాన్నెవరైనా అమ్ముతారా అని ప్రశ్నించాడు షారుఖ్. ఇక ఈ పుట్టిన రోజు నాడు తన కొత్త సినిమాల ప్రకటన కూడా షారుఖ్ చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.