మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే సినిమా ఓపెనింగ్ ఉగాది రోజు జరగనుంది. విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఫిలిం నగర్ సమాచారం. ఇటీవలే ఫైనల్ వెర్షన్ వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్న రావిపూడి షూటింగ్ ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేసేందుకు పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. 2026 సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేసేలా ఆర్టిస్టుల డేట్లు ముందే తీసుకున్నారట. విశ్వంభర దాదాపుగా అయిపోయింది కాబట్టి చిరు కాల్ షీట్ల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు.
హీరోయిన్ ఎంపికలో చాలా తెలివిగా ఆలోచించే అనిల్ రావిపూడి ఈసారి కూడా తన మార్కు చూపించేలా ఉన్నాడు. బాలీవుడ్ భామలను ఆప్షన్ గా పెట్టుకున్నట్టు తెలిసింది. పరిణితి చోప్రా ఫస్టు లిస్టులో ఉందట. ఈ మధ్య స్క్రీన్ మీద కనిపించడం తగ్గించేసిన ఈమె మంచి టాలెంటెడ్. పదమూడు సంవత్సరాల క్రితమే 2012లో రెండో సినిమా ఇషక్ జాదేలో పెర్ఫార్మన్స్ తో అవార్డులు, ప్రశంసలు కొట్టేసింది. గత ఏడాది అమర్ సింగ్ చమ్కీలాతో మరోసారి విమర్శకులను మెప్పించింది. దశాబ్దంన్నర క్రితం ఇండస్ట్రీకి వచ్చిన పరిణితి పెళ్ళయాక కొత్త సినిమాలు ఒప్పుకోలేదు. సో మెగా 158కి ఎలా స్పందిస్తుందో చూడాలి.
తర్వాతి ఆప్షన్ గా అదితిరావు హైదరి కూడా అడిగారని సమాచారం. ప్రతిపాదన వెళ్ళింది కానీ ఎలాంటి స్పందన వచ్చిందనేది సస్పెన్స్ గానే ఉంది. పండగ రోజు కథానాయిక గురించి చెబుతారో లేక ఫైనలయ్యాక అనౌన్స్ చేస్తారో వేచి చూడాలి. ఇంకా లిస్టులో అంజలి లాంటి సీనియర్లు కూడా ఉన్నారట. సీనియర్ స్టార్ల పక్కన హీరోయిన్ ని సెట్ చేయడం దర్శకులకు పజిల్ గా మారిపోయింది. తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నా మళ్ళీ రిపీట్ చేయలేని పరిస్థితి. అందుకే కొత్త ఆప్షన్స్ కోసం చూస్తున్న అనిల్ రావిపూడి చివరికి ఎవరిని లాక్ చేసి మెగాస్టార్ పక్కన ఆడి పాడిస్తాడో వేచి చూడాలి.