పృథ్విరాజ్ చెప్పిన నగ్న సత్యాలు

రేపు విడుదల కాబోతున్న ఎల్2 ఎంపురాన్ దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ కి చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. వంద కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టిన మొదటి మలయాళం సినిమాగా దీని మీద మాములు అంచనాలు లేవు. దానికి తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. సలార్ విలన్, ఎస్ఎస్ఎంబి 29 లీడ్ ఆర్టిస్ట్ గా మనకూ దగ్గరవుతున్న ఈ విలక్షణ నటుడికి డైరెక్టర్ గా పెద్ద సవాల్ ఎదురు చూస్తోంది. హీరో మోహన్ లాల్ ని వెంటేసుకుని ఎడతెరిపి లేకుండా గత వారం పది రోజుల నుంచి రాష్ట్రాలన్నీ చుట్టేస్తూ ప్రమోషన్లు చేస్తున్నాడు. ప్రెస్ మీట్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలంటూ అంతా ఆయనే కనిపిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో పృథ్విరాజ్ ఇండస్ట్రీలో ఉన్న పరిణామాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే చూద్దాం. “సినిమా అనేది ఎప్పుడూ ఒకేరకమైన స్థిరమైన లాభాలు ఇచ్చే వ్యాపారం కాదు. ఎక్కువ రిస్క్ ఉన్న పరిశ్రమగా గుర్తింపుతో పాటు ఎక్కువ ఫెయిల్యూర్ శాతం దక్కుతున్న ఇండస్ట్రీ కూడా ఇదే. ఇప్పుడంటే ఛానల్స్ పెరిగిపోయి, సోషల్ మీడియా పాకిపోయి సమాచారం సులభంగా తెలుస్తోంది కానీ గతంలోనూ ఇలాగే ఉంది. 2024లో 200 మలయాళం సినిమాలు రిలీజైతే వాటిలో 24 మాత్రమే సక్సెసయ్యాయి. మిగిలినవి కనీస స్థాయిలో ఆడలేకపోయాయి”.

మరి ఇన్ని నష్టాలు నమోదవుతున్నప్పుడు ఎందుకు నిర్మాణాలు కొనసాగుతాయంటే సమాధానం సింపుల్. ఏవైతే సినిమాలు వర్క్ అవుతున్నాయో వాటి ద్వారా వచ్చే లాభాలు నిర్మాతలకు 300 నుంచి 400 శాతం దాకా లాభాలు ఇస్తున్నాయి. ఇది పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. పోయిన చోటే వెతుక్కోమని ప్రోత్సహిస్తోంది. ఇది ఒకరకమైన గ్యాంబ్లింగ్ లాంటిదే”. చూశారుగా అరటిపండు వలిచినట్టు పృథ్విరాజ్ చెప్పిన చేదు వాస్తవాలు. మల్లువుడ్ అంత తీవ్రంగా టాలీవుడ్ ఫెయిల్యూర్ రేట్ లేదు కానీ వీలైనంత కంటెంట్ మీద దృష్టి పెట్టి మరిన్ని మంచి సినిమాలు తీయాల్సిన అవసరం అందరి మీదా ఉంది.