కన్నప్ప సినిమాను ఎవరైనా ట్రోల్ చేస్తే శివుడి ఆగ్రహానికి, శాపానికి గురి కావాల్సి వస్తుందని అందులో నటించిన రఘుబాబు తాజాగా కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. నిజానికి మంచు విష్ణు తీసుకున్న కఠిన చర్యల వల్ల మంచు ఫ్యామిలీ మీద ట్రోలింగ్ చాలా మటుకు తగ్గిపోయింది. కన్నప్ప ఫస్ట్ లుక్, పోస్టర్స్ టైంలో కొంచెం కనిపించింది కానీ టీజర్ వచ్చాక తీవ్రత తగ్గింది. పైగా ప్రభాస్ లుక్ ని రివీల్ చేయడంతో డార్లింగ్ ఫ్యాన్స్ మద్దతు మొదలయ్యింది. ఏప్రిల్ 25 రాబోతున్న ఈ ఆధ్యాత్మిక గ్రాండియర్ మీద విష్ణు చాలా ఆశలు పెట్టుకోవడమే కాక అంతకు మించి పెద్ద పెట్టుబడిని బడ్జెట్ రూపంలో ఖర్చు పెట్టాడు.
సో చివరిగా మాట్లాడాల్సింది కంటెంటే తప్ప శాపాలు కోపాలు కాదు. నిజంగా కన్నప్ప బాగుంటే ఎవరూ ఆపలేరనేది వాస్తవం. సినిమా బాగుందని వినిపిస్తే జనాలు ఆన్ లైన్ మీమ్స్, ట్రోలింగ్స్ పట్టించుకోరు. తేడా కొడితే నాలుగు వందల కోట్లు పెట్టి తీసినా లెక్క చేయరు. అదెలాగో మొన్న జనవరిలో చూశాం. ఇటీవలే కోర్ట్ కి జనం పట్టం కట్టడానికి కారణం నాని నిర్మాతని కాదు. సినిమాలో విషయముంది కాబట్టి ఆదరించి యాభై కోట్లు ఇచ్చేశారు. కార్తికేయ 2ని నార్త్ లో ఎగబడి చూశారు. కన్నప్ప ఇలాంటి వాటికన్నా చాలా పైనుంది. ఇంకా అసలు ప్రమోషన్లు మొదలుకాలేదు. ట్రైలర్ వచ్చాక లెక్కలు, హైప్ అన్నీ మారిపోతాయి.
రఘుబాబు ఏదో ఆవేశంలో అని ఉండొచ్చేమో కానీ ఇలాంటి స్టేట్ మెంట్లు బెదిరింపుల్లా అనిపిస్తాయి తప్పించి ఎలాంటి మేలు చేయవు. రాబోయే ముప్పై రోజులు కన్నప్పని ఇంకా బాగా జనంలోకి ఎలా తీసుకెళ్లాలనే దాని మీద దృష్టి పెట్టాలి. వివిధ రాష్ట్రాల్లో ఈవెంట్లు చేయాలి. ప్యాన్ ఇండియా కాబట్టి ముంబై నుంచి చెన్నై దాకా అన్ని చోట్ల మీడియాని కలుసుకోవాలి. విష్ణు కొన్ని పూర్తి చేశాడు కానీ ఇంకా చాలా కావాలి. ప్రభాస్ డేట్ కుదిరితే దానికి తగ్గట్టు శ్రీకాళహస్తి లేదా ఏదైనా శైవ క్షేత్రంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని విష్ణు ఆలోచన. వీటితో పనవుతుంది కానీ శాపాల వల్ల కాదనేది అందరూ ఒప్పుకునే వాస్తవం.