తమన్నా సినిమాకు రిస్కీ రిలీజ్ డేట్

ఒకప్పుడు తెలుగులో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. కానీ తన తరం మిగతా హీరోయిన్ల లాగే ఆమె జోరూ తగ్గిపోయింది. గత కొన్నేళ్లుగా హిందీలోనే ఎక్కువగా ఆమె సినిమాలు, సిరీస్‌లు చేస్తోంది. చివరగా ఆమె తెలుగులో నటించిన ‘భోళా శంకర్’ పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో ఇంకో సినిమా చేయడానికి చాలా టైం తీసుకుంది. చివరికి రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్ చిత్రాలు చేసిన సంపత్ నంది ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ‘ఓదెల-2’కు ఓకే చెప్పింది.

ఇది ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాకు సీక్వెల్. అదేమంత పెద్ద హిట్ కాదు. నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఇలాంటి సినిమాకు సీక్వెల్ ఏంటి అనుకున్నారు కానీ.. టీజర్ రిలీజైనపుడు అంతా షాకైపోయారు. అందులో కథాంశం, విజువల్స్, గ్రాఫిక్స్ ఒక రేంజిలో కనిపించాయి. టీజర్ వచ్చాక ‘ఓదెల-2’ మీద అంచనాలు పెరిగిపోయాయి. సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు టీం రిలీజ్ డేట్ ఖరారు చేసింది. ఏప్రిల్ 17న ‘ఓదెల-2’ను విడుదల చేయబోతున్నారు. ఆ రోజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారంటే ఎంతో కాన్ఫిడెన్స్ ఉన్నట్లే.

ఎందుకంటే ముందు వారంలో జాక్, గుడ్ బ్యాడ్ అగ్లీ మంచి అంచనాల మధ్య విడుదలవుతున్నాయి. తర్వాతి వారంలో ‘కన్నప్ప’ ఉంది. ఇవి చాలవన్నట్లు ఏప్రిల్ 17కే పలు చిత్రాలు పోటీలో ఉన్నాయి. ఆల్రెడీ ‘భైరవం’ రిలీజ్ ఖాయం చేసుకుంది. అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఘాటీ చిత్రాల విడుదలకు కూడా ఆ వీకెండ్‌ను పరిగణిస్తున్నారు. ఇలాంటి డేట్‌లో ‘ఓదెల-2’ను విడుదల చేయాలనుకోవడం సాహసమే. ఐతే టీజర్ రిలీజ్ తర్వాత సినిమాపై మంచి బజ్ క్రియేటైన నేపథ్యంలో పోటీ ఉన్నా ఆ వీకెండ్లోనే సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సంపత్ నంది స్క్రిప్టు అందించిన ఈ చిత్రాన్ని అశోక్ తేజ డైరెక్ట్ చేశాడు.