రాజమౌళి – నీల్ – సుకుమార్….ఇప్పుడు పృథ్విరాజ్

నిర్మాత దిల్ రాజు సుడి కొత్త సంవత్సరంలో మహా భేష్షుగా ఉంది. గేమ్ ఛేంజర్ నిరాశపరిచినా సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తో పాటు పలు హిట్ సినిమాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు బంగారు బాతులా మారి లాభాలు కురిపించాయి. ఇప్పుడు ఎల్2 ఎంపురాన్ ఆయనే ఏపీ, తెలంగాణలో పంపిణి చేస్తున్నారు. చివరి నిమిషంలో ఫోన్ చేసి అడిగినా అప్పటికపుడు స్పందించి ముందుకొచ్చారని దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పడం చూస్తే కంటెంట్ మీద రాజుగారికి చాలా నమ్మకం ఉన్నట్టుంది. ఇదిలా ఉంచితే పృథ్విరాజ్ మీద దిల్ రాజు ప్రశంసల వర్షం కురిపించారు. ఏకంగా లెజెండ్స్ లిస్టులో చేర్చేశారు.

గ్లోబల్ సినిమా స్థాయికి మనల్ని తీసుకెళ్లిన రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ సరసన పృథ్విరాజ్ ఈ సినిమాతో చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాదు లూసిఫర్ 3 ఇంతకన్నా పెద్ద బడ్జెట్ తో మూడు వందల కోట్ల స్థాయిని అందుకోవాలని అన్నారు. మోహన్ లాల్ గురించి మాట్లాడుతూ ఆయన్ని సూపర్ స్టార్ అనాలో ప్యాన్ ఇండియా స్టార్ అనాలో అర్థం కావడం లేదని కితాబిచ్చారు. క్యూ అండ్ ఏలో భాగంగా మార్చ్ 27, 28 తేదీల కాంపిటీషన్ గురించి వచ్చిన ప్రశ్నకు దిల్ రాజు సమాధానమిస్తూ అన్నీ పెద్ద బ్యానర్లే ఉన్నాయని, ఎవరి సినిమా ఎలా రిలీజ్ చేసుకోవాలో వాళ్లకు తెలుసంటూ చురక వేశారు.

ఈ సందర్భంగా తెలుగు పరిశ్రమ మీద మోహన్ లాల్, పృథ్విరాజ్ ఇద్దరూ తమ అభిమానాన్ని ప్రదర్శించారు. బాషా భేదం లేకుండా సినిమాలను ఆదరించే సంస్కృతి టాలీవుడ్ లాగే తమ దగ్గరా ఉందని, సలార్ కెజిఎఫ్ 2 పృథ్విరాజ్ స్వంతంగా డిస్ట్రిబ్యూట్ చేయడం, పుష్ప 2ని మొదటి రోజే మోహన్ లాల్ స్వయంగా థియేటర్ కు వెళ్లి చూసిన ఉదాహరణలు ప్రస్తావించారు. ప్రెస్ మీట్ సంగతి అలా ఉంచితే బుక్ మై షో అడ్వాన్స్ టికెట్ల అమ్మకాల్లో ఇప్పటికీ రికార్డు సృష్టించిన ఎల్2 ఎంపురాన్ పూర్తి స్థాయి బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. మార్చి 27 రిలీజ్ నాటికి టాప్ సౌత్ ఇండియన్ ఓపెనింగ్స్ లో చేరేలా ఉంది.