పృథ్విరాజ్ ట్వీట్….SSMB 29 గురించేనా ?

నిన్న మలయాళం హీరో, సలార్ విలన్ పృథ్విరాజ్ సుకుమారన్ పెట్టిన ట్వీట్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఆయన దర్శకత్వం వహించిన మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ ఈ నెల 27 విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన బాధ్యతలు, మార్కెటింగ్ పనులు అన్నీ పూర్తి చేసి హ్యాండోవర్ చేశానని, ఇకపై నాది కాని భాషలో బహు రూపాల్లో ఏకపాత్రాభినయం చేసే పాత్ర కోసం నెర్వస్ గా ఉన్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఆయన చెబుతోంది మహేష్ బాబు రాజమౌళి కలయికలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 29 గురించినేనన్నది ప్రధాన సందేహం.

ఇలా అనుకోవడానికి కారణాలు లేకపోలేదు. ఇటీవలే మహేష్ ప్యాన్ వరల్డ్ మూవీ షూటింగ్ మొదలైపోయింది. ఒక షెడ్యూల్ లో ప్రియాంకా చోప్రా పాల్గొంది. కొత్తది త్వరలోనే మొదలుపెట్టబోతున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ ఉన్నాడనే ప్రచారం గత ఏడాది నుంచే తిరుగుతోంది. నేరుగా ఆయన్నే అడిగినా ఇంకా ఫైనల్ కాలేదనే రీతిలో తప్పించుకున్నారు తప్పించి ఉన్నది లేనిది ఖరారుగా చెప్పలేదు. ఇప్పుడు ట్వీట్ ని డీ కోడ్ చేస్తే రెండు లింకులు కలిసిపోతున్నాయి కాబట్టి పృథ్విరాజ్ చెప్పింది ఎస్ఎస్ఎంబి 29 గురించేనన్నది ఒక వెర్షన్.

ఇదే నిజమవుతుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే పృథ్విరాజ్ ఇదొక్క సినిమాలోనే నటించడం లేదు. వేరే కమిట్ మెంట్స్ ఉన్నాయి. కాకపోతే తనది కానీ లాంగ్వేజ్ అన్నాడంటే అది మహేష్ గురించేననే బలమైన అభిప్రాయాన్ని కొట్టిపారేయలేం. సలార్ తో పరిచయమైన ఈ విలక్షణ నటుడు ఎలాగూ ఎల్2 ప్రమోషన్ల కోసం టాలీవుడ్ మీడియాని కలుస్తారు. అప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రశ్న ఎదురవుతుంది. ది గోట్ లైఫ్ ఆడు జీవితం పబ్లిసిటీ కోసం కొన్ని రోజులు హైదరాబాద్ లోనే ఉండిపోయిన పృథ్విరాజ్ ఇప్పుడీ ఎల్2 ఎంపురాన్ కోసం అంతకన్నా ఎక్కువ సమయం గడపడం ఖాయం.