మహేష్ బాబు రివ్యూలంటే ఆషామాషీ కాదు

స్టార్ హీరోలు రెగ్యులర్ గా సినిమాలు చూస్తుంటారు కానీ వాటిని రివ్యూ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసుకునేవాళ్ళు తక్కువ. ఈ విషయంలో మహేష్ బాబుని ప్రత్యేకంగా అభినందించవచ్చు. చిన్నా పెద్ద తేడా లేకుండా తనకు తెలిసున్న లేదా కలిసి పని చేసిన సంస్థ దర్శకుడు ఎవరి నుంచి చెప్పుకోదగ్గ మంచి రిలీజ్ వస్తే చాలు మిస్ కాకుండా చూసి ట్విట్టర్ లో తన అభిప్రాయం చెప్పేస్తాడు. ఒకవేళ నచ్చకపోతే సైలెంట్ ఉంటాడు. బాగుంటే అందరితో పంచుకుంటాడు. అయితే వీటి రీచ్ కేవలం అభిమానులకే పరిమితం కాలేదు. పక్క రాష్ట్రాల దర్శకులు కూడా మహేష్ మద్దతు కోసం ఎదురు చూస్తుంటారు.

ఇవాళ జరిగిన రిటర్న్ అఫ్ ది డ్రాగన్ సక్సెస్ మీట్ లో ఇది బయట పడింది. దర్శకుడు అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ తన ఓ మై కడవులే సినిమా చూసి మహేష్ బాబు ట్వీట్ చేయడం వల్ల ఇక్కడి ప్రేక్షకులతో పాటు భారీ సంఖ్యలో ఆడియన్స్ థియేటర్లకు వచ్చి తన కంటెంట్ మెచ్చుకున్నారని, ఇప్పుడు కూడా డ్రాగన్ ని మహేష్ బాబు చూడాలని కోరుకుంటున్నానని, ఎవరి ద్వారా అయినా ఆయనకు తన విన్నపం చేరాలని స్టేజి మీద చెప్పేశాడు. వంద కోట్ల గ్రాస్ సాధించిన సినిమా దర్శకుడు ఇలా పబ్లిక్ గా మహేష్ ని సినిమా చూడమని రిక్వెస్ట్ చేయడం చిన్న విషయం కాదుగా.

ఇదంతా బాగానే ఉంది కానీ అసలు మహేష్ కి అంత తీరిక ఎక్కడిది. రాజమౌళితో ఎస్ఎస్ఎంబి 29 మొదలయ్యాక ఫారిన్ ట్రిప్పులకు బ్రేక్ వేసేశాడు. టైం దొరికితే చాలు ఫిజికల్ ఫిట్ నెస్ కోసం జిమ్ములోనే గడపాల్సి వస్తోంది. షూటింగ్, వర్క్ షాపులు, ఫోటో షూట్లు, డిస్కషన్లు, బయట గెటప్ రివీల్ కాకుండా జాగ్రత్తగా తిరగాల్సిన పరిస్థితుల్లో ఇంత టైట్ షెడ్యూల్ మధ్య సినిమాలు చూసే వీలు దొరకడం కష్టమే. అయినా మైత్రి డిస్ట్రిబ్యూషన్ అందులోనూ తాను గతంలో మెచ్చుకున్న దర్శకుడు అశ్వత్ సినిమా కాబట్టి ఏమైనా వీలు చూసుకుని టైం కేటాయిస్తారేమో చూడాలి. ఇస్తే మాత్రం మరింత బూస్ట్ దక్కుతుంది.