జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అయితే ప్రదీప్ రంగనాథన్ సినిమాకు అదే పేరు పెట్టడంతో ఫ్యాన్స్ కొంచెం అయోమయం చెందారు. దానికి తగ్గట్టే తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు రిటర్న్ అఫ్ ది డ్రాగన్ నామకరణం చేయడం సందేహాన్ని మరింత పెంచింది. దానికి మైత్రి అధినేతల్లో ఒకరైనా రవిశంకర్ ఇవాళ జరిగిన సక్సెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రెండు వేర్వేరు డ్రాగన్లని, తారక్ ది హై వోల్టేజ్ యాక్షన్ తో అంతర్జాతీయ స్థాయిలో వివిధ భాషల్లో రిలీజవుతుందని క్లారిటీ ఇచ్చారు.
అలాని ప్రదీప్ డ్రాగన్ ని తక్కువ చేయడం లేదని, ఈ జానర్ లో ఇలాంటి యూత్ స్టోరీ ఇంత గొప్పగా పెర్ఫార్మ్ చేయడం సంతోషంగా ఉందని చెబుతూ వివరణ ఇచ్చారు. సో తారక్ నీల్ సినిమాకు డ్రాగన్ టైటిల్ పక్కన పెట్టలేదని అర్థమవుతోంది. నిర్ణయం చివరికి దర్శకుడు హీరో చేతుల్లోనే ఉంటుంది కానీ రవిశంకర్ చెప్పిన దాని ప్రకారం ఈసారి దేవరని మించే స్థాయిలో గ్లోబల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని క్లారిటీ వచ్చింది. పుష్ప 2 ది రూల్ విషయంలో అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీలతో బాలీవుడ్ లోనూ భారీ ఓపెనింగ్స్ వచ్చేలా చేసుకున్న మైత్రి బృందం చివరికి ఇండియా ఇండస్ట్రీ హిట్ సాధించింది.
ఇప్పుడీ యంగ్ టైగర్ డ్రాగన్ కు అంతకన్నా పెద్ద ప్లాన్ వేస్తున్నారు. ప్రస్తుతం హీరో లేని సన్నివేశాలను హైదరాబాద్ లో షూట్ చేస్తున్న నీల్ ఈ షెడ్యూల్ అయ్యాక తారక్ ని ఎంట్రీ చేయిస్తాడు. 1960 నేపథ్యంలో గోల్డెన్ ట్రయాంగిల్ గా పిలవబడే సముద్ర తీరప్రాంతంలో జరిగే డ్రగ్స్ మాఫియాని దీనికి బ్యాక్ డ్రాప్ గా ఎంచుకున్నట్టు లీక్ ద్వారా అందిన సమాచారం. సెన్సేషన్ అనిపించే చాలా ఇష్యూస్ ని ప్రశాంత్ నీల్ టచ్ చేసినట్టు చెబుతున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాకి కెజిఎఫ్ – సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నాడు. 2026 సంక్రాంతికి విడుదలని టార్గెట్ గా పెట్టుకున్నారు.