శేఖర్ కమ్ముల కాంప్రోమైజ్ అవ్వట్లేదు

నిర్మాణంలో ఉన్న పెద్ద సినిమాల్లో అంతగా సౌండ్ చేయకుండా కూల్ గా షూటింగ్ చేసుకుంటున్న సినిమా కుబేర. ధనుష్, నాగార్జున కలయిక కావడంతో క్రేజీ మల్టీస్టారర్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటిదాకా విడుదల తేదీని ప్రకటించకపోవడం వాళ్ళను టెన్షన్ పెడుతోంది.

దీనికి దర్శకుడు శేఖర్ కమ్ములే కారణమని ఇన్ సైడ్ టాక్. రాజీపడని ధోరణి వల్లే ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అవుట్ ఫుట్ నూటికి నూరు శాతం సంతృప్తిగా అనిపిస్తే తప్ప తర్వాతి దశకు వెళ్లడం లేదట. అందుకే ఎంత ఆలస్యమవుతున్నా సరే నో కాంప్రోమైజ్ అంటున్నారని సమాచారం.

ఒక బిచ్చగాడు వేల కోట్లు సంపాదించే ధనవంతుడిగా మారితే అతని వెనకాల పడే సిబిఐ ఆఫీసర్ డ్రామా ఆధారంగా కుబేర రూపొందిందని వినికిడి. ధనుష్, నాగ్ మధ్య వచ్చే సన్నివేశాలు శేఖర్ కమ్ముల చాలా కొత్తగా డిజైన్ చేశారట. తొంబై దశకంలో జరిగే డ్రామా కావడంతో సెట్లకు గట్రా బాగానే ఖర్చయ్యింది.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ ప్యాన్ ఇండియా మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటిదాకా కనీసం లిరికల్ వీడియోని రిలీజ్ చేయలేదు. టైటిల్ రోల్ కాకపోయినా నాగార్జున పాత్ర పట్ల అక్కినేని ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. నా సామిరంగా తర్వాత నాగ్ దర్శనమిచ్చేది ఇందులోనే.

ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే మార్చిలో వచ్చే ఛాన్స్ దాదాపు లేనట్టే. ఏప్రిల్ అనుకుంటే కనీసం చిన్న మోతాదులో ప్రమోషన్లు ఇప్పటి నుంచే మొదలుపెట్టాలి. టీజర్ ఆల్రెడీ పాతదైపోయింది. కొత్త కంటెంట్ వదలాలి. ముఖ్యంగా పాటలకు రీచ్ వచ్చేలా చూసుకోవాలి. తమిళంలోనూ పెద్ద మార్కెట్ దొరుకుతుంది కాబట్టి క్లాష్ లేకుండా వీలైనంత సోలో డేట్ దక్కేలా చూసుకోవాలి.

శేఖర్ కమ్ముల తన కూల్ ఎమోషన్స్ వదిలి లీడర్ తర్వాత అంతకు మించి సీరియస్ సబ్జెక్టు ఎంచుకున్నారు. అందులోనూ ఇద్దరు హీరోలతో. ఇదంతా ఎలా ఉన్నా ముందైతే కుబేర మోక్షం ఎప్పుడో వీలైనంత త్వరగా ప్రకటిస్తే బెటర్.