అనుప‌మ‌కు ఎట్ట‌కేల‌కు ఓ సినిమా


అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ స్వ‌త‌హాగా మ‌ల‌యాళీ అమ్మ‌యే అయినా.. తెలుగులోనే ఆమెకు ఎక్కువ అవ‌కాశాలు ల‌భించాయి. ఇక్క‌డే ఆమె స్టార్ హీరోయిన్ అయింది. కెరీర్ ఆరంభంలో ప్రేమ‌మ్, అఆ, శ‌త‌మానం భ‌వ‌తి లాంటి సినిమాల‌తో ఆమె కెరీర్ దూసుకెళ్లింది. కానీ ఆ ఊపును ఆ త‌ర్వాత కొన‌సాగించ‌లేక‌పోయిందామె. మ‌ధ్య‌లో వ‌రుస‌గా ఫ్లాపులొచ్చాయి. అయినా కొంచెం పుంజుకుని మ‌ళ్లీ సినిమాలు ద‌క్కించుకుంది. హిట్లు కూడా ఇచ్చింది. అయినా స‌రే రేసులో ఆమె వెనుక‌బ‌డిపోయింది.

హ‌లో గురూ ప్రేమ కోస‌మే, రాక్ష‌సుడు లాంటి హిట్ల త‌ర్వాత కూడా ఆమె లైమ్ లైట్లో లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యమే. ఇక టాలీవుడ్లో అనుప‌మ కెరీర్ ముగిసిన‌ట్లే అని అంతా భావిస్తున్న త‌రుణంలో ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ ఓ ఛాన్స్ అందుకుంది ఈ మ‌లయాళ కుట్టి.

నిఖిల్ హీరోగా సుకుమార్ స్క్రిప్టుతో ఆయ‌న శిష్యుడు ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ రూపొందించ‌నున్న కొత్త సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా ఖ‌రారైంది. గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ ఉమ్మ‌డిగా నిర్మించ‌నున్న ఈ సినిమాలో అనుప‌మ న‌టించ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.

నిజానికి ఈ సినిమా క‌థానాయిక‌గా ముందు వినిపించిన పేరు అనుప‌మ‌దే. కానీ త‌ర్వాత ఆమె స్థానంలోకి గ్యాంగ్ లీడ‌ర్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహ‌న్ వ‌చ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఇప్పుడు ఆ ప్ర‌చారానికి తెర దించుతూ అనుప‌మ‌ను క‌థానాయిక‌గా ప్ర‌క‌టించారు. ఇది ఒక డైరీ నేప‌థ్యంలో సాగే సినిమా. క‌థానాయిక పాత్ర కీల‌కంగా ఉంటుంద‌ట‌. సుకుమార్ స్క్రిప్టు అంటే ఇందులో ఏదో ప్ర‌త్యేక‌త ఉంటుంద‌నే అంతా అనుకుంటున్నారు. మ‌రి ఈ సినిమాతో అనుప‌మ కెరీర్ ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి.