అజయ్ భూపతికి అగ్ని పరీక్ష

‘ఆర్ఎక్స్ 100’ మూవీతో అరంగేట్రంలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి. ఆ తర్వాత తన నుంచి వచ్చిన ‘మహా సముద్రం’ తీవ్ర నిరాశకు గురి చేసింది. అతను వన్ ఫిలిం వండర్ అయిపోతాడా అనే సందేహాలు కలిగాయి. కానీ మూడో చిత్రం ‘మంగళవారం’తో తన సత్తాను మరోసారి చాటి చెప్పాడు అజయ్ భూపతి. కమర్షియల్‌గా మరీ పెద్ద సక్సెస్ కాలేదు కానీ.. బోల్డ్ కథ, థ్రిల్లింగ్ నరేషన్‌తో ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

దీని తర్వాత అజయ్ భూపతికి కొంచెం పెద్ద సినిమాలోనే ఛాన్స్ వస్తుందని అనుకున్నారు. అందుకు తగ్గట్లే తమిళ సీనియర్ హీరో విక్రమ్ తనయుడైన ధ్రువ్ విక్రమ్‌తో ఒక ప్రాజెక్టు ఓకే అయ్యేలా కనిపించింది. తమిళ, తెలుగు భాషల్లో పెద్ద బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. ఐతే ఇక ప్రకటనే తరువాయి అనుకున్న ఈ చిత్రం ఏవో కారణాలతో ఆగిపోయింది.

కాగా ఇప్పుడు అజయ్ వేరే ప్రాజెక్టును ఓకే చేయించుకున్నట్లు తెలిసింది. ఈసారి అతను కొంచెం రేంజ్ తగ్గించుకునే సినిమా చేయబోతున్నాడు. ‘పెదకాపు’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన విరాట్ కర్ణ హీరోగా అజయ్ భూపతి సినిమా చేయనున్నాడట. ‘అఖండ’ సినిమా ప్రొడ్యూసర్ కుటుంబ సభ్యుడైన విరాట్ మీద మంచి బడ్జెట్ పెట్టి ‘పెదకాపు’ తీశారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వాషౌట్ అయింది. ఆ తర్వాత అతను ప్రధాన పాత్రలో అభిషేక్ నామా ‘నాగబంధం’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే మొదలైంది. ఇంతలో అజయ్ భూపతి సినిమా ఓకే అయింది.

విరాట్‌కు ఇది కచ్చితంగా మంచి ఛాన్సే. కానీ ఈసారి ఎవరైనా పేరున్న హీరోతో సినిమా చేయాలని చూసిన అజయ్‌ ఈ హీరోతో సర్దుకుపోవాల్సి వస్తోంది. ఇలాంటి హీరోతో సినిమా చేసి హిట్ కొట్టడం అంటే అజయ్‌కి పరీక్ష అన్నట్లే. కానీ ఈసారి ‘ఆర్ఎక్స్ 100’ తరహాలో సక్సెస్ సాధిస్తే ఆటోమేటిగ్గా ఓ మిడ్ రేంజ్ హీరోతో సినిమా చేసే అవకాశం లభిస్తుంది.