ప్రభాస్ చెప్పే సిరివెన్నెల కబుర్లు

ప్రభాస్ వ్యవహారం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలామంది స్టార్ల లాగా బయట, సోషల్ మీడియాలో ప్రచార హడావుడి ఉండదు. సినిమాలు చేస్తాడు. అవసరమైనపుడు వాటిని కొంతమేర ప్రమోట్ చేస్తాడు. అంతే తప్ప మీడియా దృష్టిలో ఉంటూ పబ్లిసిటీ తెచ్చుకోవాలని కోరుకోడు. అదే సమయంలో ఎవరికైనా సినిమాల పరంగా సాయం అవసరమైతే ప్రమోట్ చేసి పెడతాడు.

ప్రభాస్ మీడియాకు దొరకడం మాత్రం చాలా తక్కువ. గత కొన్నేళ్లలో ప్రభాస్ పాల్గొన్న టీవీ షో.. అన్‌స్టాపబుల్ ఒక్కటే. అది కూడా అల్లు అరవింద్, బాలకృష్ణ అడిగేసరికి కాదనలేకపోయాడు. అది తప్ప వేరే ఏ షోలోనూ ప్రభాస్ కనిపించలేదు. ఐతే ఇప్పుడు రెబల్ స్టార్ ఎవ్వరూ ఊహించని ఓ షోలో సందడి చేయబోతున్నాడు. అదే.. నా ఉచ్ఛ్వాసం కవనం.

దివంగత, దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జ్ఞాపకాలను ఆయన అభిమానులు, సన్నిహితులు నెమరు వేసుకునే కార్యక్రమం ఇది. ఇందులో కృష్ణవంశీ సహా చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. సీతారామశాస్త్రితో తమకున్న అనుబంధాన్ని.. ఆయన పాటల గొప్పదనంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఐతే ఎక్కువగా దర్శకులు, టెక్నీషియన్లే ఇందులో పాల్గొన్నారు. స్టార్ హీరోలెవరూ దీనికి హాజరు కాలేదు. ఇలాంటి కార్యక్రమానికి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ప్రభాస్ సినిమాల్లో పలు పాటలకు సిరివెన్నెల సాహిత్యం అందించినా.. ‘చక్రం’ మూవీలో ‘జగమంత కుటుంబం నాది’ చాలా ప్రత్యేకం. ప్రభాస్ తన జీవితాంతం గుర్తుంచుకునే గుర్తుంచుకునే పాట అది. ఆ పాట వల్ల సిరివెన్నెల వారితో ప్రభాస్‌కు ప్రత్యేకమైన కనెక్షన్ ఉంది. కాబట్టే ప్రభాస్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేకం. ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ సాహిత్య ప్రాధాన్యం ఉన్న ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ప్రశంసనీయం.