విశ్వక్సేన్‌ను నమ్మొచ్చా?


టాలీవుడ్లో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి హీరోగా తనకంటూ ఒక ఇమేజ్, ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరోల్లో విశ్వక్సేన్ ఒకడు. ఈ తరం యువత ఆలోచనలకు తగ్గట్లుగా సినిమాలు చేయడమే కాదు.. వాళ్లకు నచ్చేలా వేదికల మీద మాట్లాడ్డం ద్వారా తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు విశ్వక్. తన సినిమాలను అతను ప్రమోట్ చేసే తీరు కూడా భిన్నంగా ఉంటుంది. కొంచెం అతి అనిపించేలా, వివాదాస్పదం అయ్యేలా ఏదో ఒకటి మాట్లాడ్డం, ఇంకేదైనా చేయడం ద్వారా అతను తన సినిమాలను ప్రమోట్ చేస్తుంటాడు.

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా టైంలో జరిగిన గొడవ గురించి తెలిసిందే. అలాగే కొన్ని సినిమాల్లో విషయం లేకున్నా వాటి గురించి అతిగా చెప్పి విమర్శలు కొని తెచ్చుకున్నాడు. ‘పాగల్’ అనే సినిమా గురించి చెబుతూ కరోనా టైంలో మూతబడ్డ థియేటర్లను కూడా ఈ సినిమా తెరిపిస్తుందని కామెంట్ చేశాడు విశ్వక్. తీరా చూస్తే సినిమా అంచనాలు అందుకోలేదు. సినిమాను ప్రమోట్ చేయడానికి కావాలనే కొంచెం ఎక్కువ మాట్లాడానంటూ తర్వాత కవర్ చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలో తన సినిమాల గురించి విశ్వక్ మరీ హైప్ ఇస్తుంటే జనాలకు అనుమానాలు కలుగుతుంటాయి. తన చివరి చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ గురించి అతను ఇచ్చినంత బిల్డప్ సినిమాలో లేకపోయింది. దీంతో తన కొత్త సినిమా ‘మెకానిక్ రాకీ’ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా సందేహాలు రేకెత్తిస్తోంది. విడుదలకు ముందు రోజే ఈ సినిమాకు పెయిడ్ ప్రిమియర్స్ వేస్తామని.. అవి చూసిన వాళ్లు సినిమా బాలేదని అంటే తర్వాత సినిమా చూడాల్సిన అవసరం లేదని అతను వ్యాఖ్యానించాడు. ఒకసారి చూసిన వాళ్లు రెండోసారి ఈ సినిమా చూస్తారన్నాడు.

సెకండాఫ్‌లో ‘మెకానిక్ రాకీ’ థియేటర్లు ఆడిటోరియాలుగా మారిపోతాయని.. ప్రేక్షకులు కుదురుగా కూర్చోలేరని అన్నాడు. మామూలుగా ప్రతి ఒక్కరూ తమ సినిమాల గురించి ఎక్కువే చెప్పుకుంటారు. విశ్వక్ ఇంకా ఎక్కువగానే తన చిత్రాలకు హైప్ ఇచ్చుకుంటూ ఉంటాడు. దీనికి తోడు గత అనుభవాలను కూడా దృష్టిలో ఉంచుకుని ‘మెకానిక్ రాకీ’ గురించి విశ్వక్ చెప్పిన మాటలు నమ్మాలా వద్దా అని ప్రేక్షకులు సందేహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.