అన్న థియేటర్లో – తమ్ముడు ఓటిటిలో

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆనంద్ దేవరకొండ ఇంకా హిట్టు కోసం చకోరపక్షిలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. డెబ్యూ మూవీ దొరసాని నిరాశపరచగా రెండోది మిడిల్ క్లాస్ మెలోడీస్ లో మంచి కంటెంటే ఉన్నప్పటికీ కరోనా పరిస్థితుల్లో డైరెక్ట్ ఓటిటికి వెళ్లిపోయింది. డిజిటల్ లో వచ్చినప్పటికీ మంచి రెస్పాన్సే తెచ్చుకుంది.

మూడోది పుష్పక విమానంని ప్రచార ఆర్భాటాల మధ్య థియేటర్లలో వదిలారు కాని ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కట్ చేస్తే ఓటిటిలో చూసిన జనాలే ఎక్కువని తేలింది. ఇప్పుడు నాలుగోది హైవే. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నప్పటికే సరైన రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన ఈ సైకో థ్రిల్లర్ ఎట్టకేలకు ఓటిటి రూటే ఎంచుకుంది.

ఈ నెల 19న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆ మేరకు సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. బాక్సాఫీస్ వద్ద నెలకొన్న అనిష్చితిని దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు తెలివైన నిర్ణయమే తీసుకున్నారు. జనాలు చిన్న బడ్జెట్ సినిమాలకు థియేటర్ దాకా రావడం లేదు. ఏదో మరీ అద్భుతంగా ఉందని పబ్లిక్ చెబితేనో మీడియాలో వస్తేనో  తప్ప కాలు బయట పెట్టడం లేదు

అన్న విజయ్ లైగర్ ఆగస్ట్ 25న అత్యథిక స్క్రీన్లలో వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అందుకోనుంది. దానికి వారం ముందు హైవేని ఇలా స్మార్ట్ స్క్రీన్లలో వదలబోతున్నారు. దీనికి దర్శకుడు కెవి గుహన్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్. తెలుగులో కళ్యాణ్ రామ్ 118తో డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టారు. దానికి మంచి పేరే వచ్చింది. ఆ మధ్య డబ్ల్యు డబ్ల్యుడబ్ల్యు అనే చిన్న సినిమా ఓటిటికి చేశారు. టెక్నికల్ గా పేరొచ్చింది. ఇప్పుడీ హైవేతో ఏం చేయబోతున్నారో చూడాలి. ఇవి కాకుండా ఆనంద్ లిస్టులో బేబీ, గంగంగణేష్ లు చివరి దశ నిర్మాణంలో ఉన్నాయి.