సాయిపల్లవి టార్గెట్ అయిపోయింది

సాయిపల్లవి పరభాషా నటే అయినా.. మన వాళ్లు ఆమెను ఆ కోణంలో చూడరు. ఫిదా అనే ఒకే ఒక్క సినిమాతో ఆమె లక్షల మందికి ఫేవరెట్ అయిపోయింది. ఆ తర్వాత చేసిన చిత్రాలతో ఇంకా ఇంకా ఫాలోయింగ్ పెంచుకుంది. ఇప్పుడు తెలుగులో సాయిపల్లవికి ఉన్న కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అంటే అతిశయోక్తి కాదు.

పూజా హెగ్డే, రష్మిక మందన్నా లాంటి వాళ్లు ఇంకా పెద్ద స్టార్లు అయ్యుండొచ్చు. తనకన్నా ఎక్కువ పారితోషకం తీసుకుంటూ ఉండొచ్చు. కానీ సాయిపల్లవి నటన చూడ్డానికి వచ్చిన స్థాయిలో వాళ్ల కోసం ప్రేక్షకులు థియేటర్లకు రారు. సినిమాల్లో తన నటనతో ఆకట్టుకోవడంతో పాటు బయట కూడా తెలుగు ప్రేక్షకుల గురించి చాలా ఉద్వేగంగా మాట్లాడుతూ వారి మనసులు దోచుకుంటూ ఉంటుంది సాయిపల్లవి.

ఐతే ఇప్పటిదాకా ఏ చిన్న వివాదానికి తావివ్వని సాయిపల్లవి.. తాజాగా ఓ అనుకోని గొడవలో చిక్కుకుంది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా సాయిపల్లవి చేసిన కామెంట్ల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ మద్దతుదారులు.. ఆమెను టార్గెట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. తన భావజాలం గురించి మాట్లాడుతూ.. తాను లెఫ్ట్, రైట్ అంటూ ఏదో ఒక సైడ్ తీసుకోనని.. ఎవరిది ఒప్పో ఎవరిది తప్పో చెప్పలేనని.. అన్నిటికంటే మానవత్వం గొప్పదని ఈ ఇంటర్వ్యూలో సాయిపల్లవి వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా ఆమె ఒక ఉదాహరణ చెప్పింది. ఇటీవల వచ్చిన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో ఒకప్పుడు కశ్మీర్ పండిట్ల మీద జరిగిన అఘాయిత్యాల గురించి చూపించారని.. కానీ ఇటీవల గోవులను వాహనంలో తరలిస్తున్నందుకు ఒక వ్యక్తిని కొట్టి చంపేశారని.. అప్పుడు జరిగింది అన్యాయం అయినపుడు ఇది కూడా అన్యాయమే కదా.. ఆ తప్పును మనం కూడా చేస్తున్నట్లే కదా అన్నట్లు మాట్లాడింది సాయిపల్లవి. కాబట్టి తన దృష్టిలో ఎవరి భావజాలం కరెక్ట్ అనేది ముఖ్యం కాదని.. మనం మంచి మనుషులుగా ఉండడం, మానవత్వం చూపించడం ప్రధానం అని సాయిపల్లవి పేర్కొంది. ఆమె వ్యాఖ్యలు సహేతుకంగానే ఉన్నప్పటికీ.. హిందుత్వ వాదులను, బీజేపీని తప్పుబట్టిందంటూ ఓ వర్గం ఆమెను టార్గెట్ చేస్తోంది.