కన్నీళ్లలో తడిసి ముద్దవుతున్న థియేటర్లు

మార్చి 17.. కన్నడ నాట కోట్ల మందికి ఇది పండుగ రోజు. కన్నడ సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజిది. గత ఏడాది వరకు ఈ రోజును పునీత్ పుట్టిన రోజు అనే అనేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ రోజును జయంతి అనాల్సిన బాధాకరమైన పరిస్థితి తలెత్తింది. కొన్ని నెలల కిందట హఠాత్తుగా గుండెపోటుతో మరణించి కోట్లాది అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తాడు పునీత్. కన్నడిగులు దేవుడిలా చూసే రాజ్ కుమార్ తనయుడు, పైగా నటుడిగా, వ్యక్తిగా చాలా గొప్ప పేరు సంపాదించాడు.

సినిమాలతో అభిమానులను అలరిస్తూనే అనితర సాధ్యమైన రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తూ సామాన్య జనం గుండెల్లో చోటు సంపాదించాడు. ఇలాంటి వ్యక్తి తక్కువ వయసులో కాలం చేయడంతో తట్టుకోవడం కన్నడిగుల వల్ల కాలేదు. నెలలు గడుస్తున్నా వారిని ఆ బాధ వీడటం లేదు. ఇలాంటి సమయంలో పునీత్ పుట్టిన రోజు వచ్చింది. అదే రోజు పునీత్ చివరి సినిమా ‘జేమ్స్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

‘జేమ్స్’ రిలీజ్‌కు భారీ ఎత్తున సన్నాహాలు జరిగాయి. వారం రోజుల పాటు కర్ణాటకలోని ఏ థియేటర్లోనూ వేరే సినిమాను ప్రదర్శించడం లేదు. పునీత్ కొన్ని సన్నివేశాలు మినహా ఈ సినిమాను పూర్తి చేశాడు. ఆ సీన్లు పక్కన పెట్టి సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. పునీత్ డబ్బింగ్ చెప్పకపోయినా.. అతడి అన్నయ్య శివరాజ్ కుమార్‌ వాయిస్‌తో మేనేజ్ చేస్తున్నారు. ఇలా పునీత్ పుట్టిన రోజుకు కష్టపడి సినిమాను రెడీ చేశారు. పునీత్‌ను చివరిసారిగా వెండితెరపై చూసుకోవడానికి అభిమానులు భారీగా సన్నాహాలు చేసుకున్నారు.

ప్రతి థియేటర్‌నూ భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో ముస్తాబు చేశారు. ఐతే థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తున్నప్పటికీ.. లోలోన అందరిలోనూ ఉద్వేగం కట్టలు తెంచుకుంటోంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే షోలు మొదలయ్యాయి. అప్పును చివరిసారి తెరపై చూస్తూ అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సినిమా చూసేందుకు లోపలికి వెళ్తూ.. చూసి బయటికి వస్తూ అభిమానులు ఏడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. సినిమా ఎలా ఉన్నప్పటికీ ఇది బ్లాక్ బస్టర్ కావడం గ్యారెంటీ అన్నది స్పష్టం.