ఎవరు మీలో కోటీశ్వరులు.. ఎమోషనల్ టచ్

https://www.youtube.com/watch?v=akF45nJzDaQ

ఇండియాలో సూపర్ పాపులర్ అయిన టీవీ రియాలిటీ షోల్లో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఒకటి. దీన్ని తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ పేరుతో చాలా ఏళ్ల కిందటే మొదలుపెట్టారు. మూడు సీజన్ల పాటు నాగార్జున హోస్ట్‌గా చేస్తే.. తర్వాత చిరంజీవి ఒక సీజన్‌ను నడిపించారు. ఐతే తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది.

అప్పుడు మా టీవీలో ఈ షో ప్రసారం అయితే.. ఇప్పుడు జెమిని టీవీ వాళ్లు దీన్ని టేకప్ చేశారు. ఇప్పుడు షో పేరును ‘ఎవరు మీలో కోటీశ్వరులు’గా మార్చి.. ఎన్టీఆర్ హోస్ట్‌గా కొత్త సీజన్ మొదలు పెడుతున్నారు. వేసవిలోనే షో మొదలు కావాల్సింది కానీ.. కరోనా కారణంగా బ్రేక్ పడింది. సెకండ్ వేవ్ ఉద్ధృతి తగ్గాక మళ్లీ పని మొదలుపెట్టారు. కొన్ని ఎపిసోడ్ల షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఆగస్టులోనే ఈ షో ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా కొత్త ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు.

కరోనా కారణంగా జనాల జీవితాలు ఎలా తల్లకిందులయ్యాయో తెలిసిందే. ఆ నేపథ్యాన్నే తీసుకుని ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కొత్త ప్రోమోను ఎమోషనల్‌గా తీర్చిదిద్దారు. కాలేజీలో పాఠాలు చెప్పే ఒక లెక్చరర్ ఉద్యోగం కోల్పోవడం.. ఆ తర్వాత టిఫిన్ కొట్టు పెట్టుకోవడం.. అక్కడ డబ్లుల్లేని పేద విద్యార్థులు కొందరికి ఉచితంగా టిఫిన్ పెట్టడం.. ఆపై ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో పాల్గొని రూ.25 లక్షలు గెలవడం.. ఆ డబ్బు ఏం చేస్తారని ఎన్టీఆర్ అడిగితే సగం డబ్బులు ఫీజులు కట్టలేని విద్యార్థులకు ఇస్తానని.. మిగతా సగం ఇంటి ఖర్చులకు ఉపయోగించుకుంటానని అనడం.. దీనికి ఎన్టీఆర్ శభాష్ అంటూ భుజం తట్టడం.. ఇలా ఎమోషనల్‌గా నడిచింది ప్రోమో.

‘బిగ్ బాస్’ షోను అద్భుతంగా నడిపించి గొప్ప పేరు సంపాదించిన తారక్.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ను కూడా తనదైన వాక్చాతుర్యం, స్పాంటేనిటీతో విజయవంతం చేస్తాడన్న అంచనాలు ఉన్నాయి. చూద్దాం మరి షో ఎలా ఉంటుందో?