ముంబ‌యిలో విజ‌య్-ర‌ష్మిక మీటింగ్


విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మిక మంద‌న్నాల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎంత బాగుంటుందో గీత గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ సినిమాల్లో చూశాం. నిజం చెప్పాలంటే వాళ్ల ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీకి కూడా తిరుగులేదు. గీత గోవిందం సినిమాకు అదే పెద్ద ప్ల‌స్ అయింది. సోష‌ల్ మీడియాలో, బ‌య‌ట సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ల‌లో వీళ్ల గిల్లిక‌జ్జాలు గీత గోవిందంకు మంచి హైపే తెచ్చాయి. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ట‌యిందో తెలిసిందే.

డియ‌ర్ కామ్రేడ్‌కు కూడా ఈ జోడీ మంచి హైపే తేగ‌లిగింది కానీ.. సినిమా అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ఈ ఇద్ద‌రూ క‌లిసి రెండో సినిమా చేస్తున్న స‌మ‌యంలో వీరి మ‌ధ్య ఏదో ఉంద‌నే ప్ర‌చారం గ‌ట్టిగా న‌డిచిన సంగ‌తి తెలిసిందే. ఎంగేజ్మెంట్ చేసుకున్న ర‌క్షిత్ శెట్టి నుంచి ర‌ష్మిక విడిపోవ‌డానికి కూడా విజ‌యే కార‌ణ‌మ‌న్న ఊహాగానాలు కూడా వినిపించాయి. ఐతే విజ‌య్, ర‌ష్మిక త‌ర్వాత క‌లిసి న‌టించ‌క‌పోవ‌డంతో ఈ ప్ర‌చారానికి కొంచెం బ్రేక్ ప‌డింది.

ఐతే విజ‌య్ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన స‌మ‌యంలో ర‌ష్మిక ఆ వేడుకకు హాజ‌రు కావ‌డం తెలిసిందే. ఇప్పుడు విజ‌య్‌ను ఆమె ముంబ‌యిలో క‌లుసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇద్ద‌రూ కార్లోంచి దిగి ఓ ఇంట్లోకి వెళ్తుండ‌గా కెమెరాల‌కు చిక్కారు. ఈ సంద‌ర్భంగా ర‌ష్మిక చేతిలో పుష్ప‌గుచ్ఛం ఉంది. బ‌హుశా విజ‌య్ చేస్తున్న లైగ‌ర్ సినిమా నిర్మాత‌ల్లో ఒక‌రైన క‌ర‌ణ్ జోహార్‌ను క‌ల‌వ‌డానికి ర‌ష్మిక‌ను వెంట‌బెట్టుకుని వెళ్తుండొచ్చ‌ని భావిస్తున్నారు.

లైగ‌ర్ షూటింగ్ కోసం చాలా రోజుల నుంచి ముంబ‌యిలోనే ఉంటున్నాడు విజ‌య్. త‌న బాలీవుడ్ ఎంట్రీ మూవీ మిషన్ మ‌జ్ను చిత్రీక‌ర‌ణ కోసం ర‌ష్మిక కూడా ముంబ‌యికి వెళ్లింది. ఈ నేప‌థ్యంలో ఈ ఇద్ద‌రూ క‌లిసిన‌ట్లున్నారు. ఇద్ద‌రూ మంచి స్నేహితులు కావ‌డం వ‌ల్లే క‌లిసి ఉండొచ్చు. అంత‌కుమించి ఈ క‌ల‌యిక గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదన్న‌ది వారి స‌న్నిహితుల మాట‌.