‘విజయ్’ పార్టీపై రచ్చ.. తండ్రి ఏమన్నాడంటే?

తమిళనాట ఇప్పుడు రజినీకాంత్‌ను మించిన ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్న హీరో విజయ్. అక్కడ బడా సినీ హీరోలు రాజకీయ నాయకులుగా మారడం ఆనవాయితీనే. ఇప్పటికే కమల్ హాసన్ రాజకీయాల్లో ఉండగా.. రజినీ కూడా ఆ దిశగా అడుగులేస్తున్నాడు. వీరి బాటలో విజయ్ కూడా రాజకీయాల్లో అడుగు పెట్టొచ్చనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. ఐతే అందుకు ఇంకా సమయం రాలేదని విజయ్ భావిస్తున్నాడు.

ఐతే విజయ్ కంటే ముందు అతడి తండ్రి చంద్రశేఖర్.. కొడుకు రాజకీయారంగేట్రంపై ముచ్చట పడిపోయాడు. విజయ్ అభిమానులతో కలిసి తాను మొదలుపెట్టిన ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ అనే అభిమాన సంఘాన్ని ఇటీవలే ఆయన రాజకీయ పార్టీగా మార్చేశారు. ఇది తమిళనాట పెద్ద చర్చనీయాంశంగా మారింది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాడంటూ అభిమానుల్లో కోలాహలం మొదలైంది.

ఐతే విజయ్ వెంటనే స్పందించి.. ఆ పార్టీకి తనకు సంబంధం లేదని, తన ఫొటోలు సహా ఏమీ ఆ పార్టీ కోసం వాడటానికి వీల్లేదని.. అభిమానులు ఆ పార్టీలో చేరొద్దని ప్రెస్ నోట్ ద్వారా స్పష్టం చేశాడు. అలాగే విజయ్ తల్లి, చంద్రశేఖర్ భార్య సైతం తాను ఆ పార్టీలో లేనని ప్రకటించింది.

దీంతో విజయ్‌కు, అతడి తండ్రికి విభేదాలు నెలకొన్నాయని, ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందనే ప్రచారం మొదలైంది. దీనిపై ఇప్పుడు చంద్రశేఖర్ స్పందించాడు. 1993లో విజయ్ అభిమానుల కోసం ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ను మొదలుపెట్టింది తానే అని, దాని సభ్యులకు తగిన గుర్తింపు ఇవ్వాలన్న ఆశయంతోనే రాజకీయ పార్టీగా రిజిస్టర్‌ చేయించానని ఆయన చెప్పారు.

విజయ్‌కి కూడా మంచి చేయాలన్న తలంపుతోనే తాను ఈ పని చేశానన్నాడు. ఈ విషయాన్ని విజయ్‌ త్వరలో అర్థం చేసుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశఆడు. తన ఫొటోను, ఇయక్కం పతాకాన్ని ఉపయోగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని విజయ్‌ హెచ్చరించడంపై ఆయన స్పందిస్తూ.. తనపై చర్యలు తీసుకుని జైలుకు పంపినా బాధపడనని చెప్పాడు.
వ్యవస్థాపకుడిగా ఉంటున్న తాను విజయ్‌ మక్కల్‌ ఇయక్కంను రాజకీయ పార్టీగా మార్చే హక్కు ఉందన్నాడు. తండ్రీకొడుకుల మధ్య మనస్పర్థలు రావడం, మాట్లాడకుండా ఉండటం సాధారణమైన విషయాలేనని.. విజయ్‌కి తెలియకుండా అనేక రహస్య సంఘటనలు జరుగుతున్నాయని, అతడి పేరిట వచ్చిన ప్రెస్ నోట్ కూడా విజయ్ విడుదల చేసింది కదాని చంద్రశేఖర్ అన్నాడు. ఈ వ్యాఖ్యలపై విజయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.