బిలియనీర్ల సిటీగా ముంబయి.. బీజింగ్ ను దాటేసింది!

తాజాగా విడుదలైన హురుస్ గ్లోబల్ రిచ్ లిస్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బిలియనీర్ల సిటీగా ముంబయికి గుర్తింపు లభించింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే చైనా రాజధాని బిజింగ్ ను దాటేసింది దేశ ఆర్థిక రాజధాని. తాజాగా విడుదలైన జాబితాలో ముంబయిలో 92 మంది అత్యంత సంపన్నులు ఉన్నారని.. అదే సమయంలో బీజింగ్ లో ఈ సంఖ్య 91గా ఉండటం గమనార్హం.
చైనాలో మొత్తం 814 మంది బిలియనీర్లు ఉండగా.. భారత్ లో మాత్రం 271 మంది ఉన్నట్లుగా పేర్కొంది.

దేశీయంగా కుబేరుల మొత్తం సంపద లక్ష కోట్ల దాలర్ల స్థాయిలో ఉందని పేర్కొంది. దేశంలో అత్యంత సంపన్న భారతీయుడిగా రిలయన్స్ అధినేత ముకేష్ అంభానీ మరోసారి నిలిచారు. ఆయన ఆస్తి విలువ 115 బిలియన్ డాలర్లుగా తాజా జాబితా వెల్లడించింది. ఏడాది వ్యవధిలో ముకేశ్ అంబానీ ఆస్తి విలువ మరో 40 శాతం పెరిగినట్లుగా పేర్కొంది. ఇది 33 బిలియన్ డాలర్లకు సమానం. గత ఏడాది హిండెన్ బర్గ్ నివేదికతో భారీగా దెబ్బ తిన్న గౌతమ్ అదానీ తిరిగి కోలుకున్నట్లుగా తాజా నివేదిక వెల్లడించింది. ఆయన సంపద ఏడాదిలో 62 శాతం పెరిగింది.

అంతర్జాతీయంగా ముకేశ్ అంబానీ పదో స్థానంలో ఉండగా.. గౌతమ్ అదానీ పదిహేనో స్థానంలో నిలిచారు. హిండెన్ బర్గ్ నివేదికకు ముందు ప్రపంచంలోని టాప్ 5 సంపన్నుల జాబితాలోకి వెళ్లటం.. ముకేశ్ అంబానీని అధిగమించటం తెలిసిందే. ఇక.. ప్రపంచ సంపన్నుడిగా టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ నిలిచారు. ఆయన ఆస్తి మొత్తం 231 బిలియన్ డాలర్లుగా తేల్చారు. కొత్త బిలియనీర్ల జాబితాలో చైనాను భారత్ అధిగమించటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. భారత్ నుంచి ఈ జాబితాలో 94 మంది చోటు దక్కించుకోగా.. చైనా నుంచి మాత్రం 55 మందికి మాత్రమే చోటు లభించింది. ఏడాది వ్యవధిలో ముంబయిలో 27 మంది బిలియనీర్లు ఉండగా.. బీజింగ్ లో మాత్రం ఆరుగురు మాత్రమే ఈ హోదా దక్కించుకోవటం గమనార్హం.