తిరుప‌తిలో ఇలా చేద్దాం.. చంద్ర‌బాబు అదిరిపోయే ఐడియా!

రాష్ట్రంలో ఉప ఎన్నిక‌కు అవ‌కాశం ఉన్న తిరుప‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో టీడీపీ ఎలా ముందుకు సాగుతుంది? ఏ నిర్ణ‌యం తీసుకుంటుంది? ఎవ‌రికి అవ‌కాశం ఇస్తుంది? అనే విష‌యాలు ఇటీవ‌ల చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో టీడీపీ ఒంట‌రి పోరు సాగించాల్సి వ‌చ్చిన‌ప్పుడు.. ఈ సీటును సీనియ‌ర్ నాయ‌కురాలు, కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మికి ఇచ్చారు చంద్ర‌బాబు. అయితే, ఆమె ఓడిపోయారు. ఇక‌.. ఇప్పుడు ఏం చేయాలి? అనే ఆలోచ‌న వ‌స్తే.. ఈ ప‌రిస్థితిని పార్టీకి, వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు కూడా సానుకూలంగా మార్చుకునేలా అదిరిపోయే ఐడియా వేశార‌ని టీడీపీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

గ‌త కొన్నాళ్ల ప‌రిస్థితిని తీసుకుంటే.. తిరుపతి అసెంబ్లీ నియోజ‌వ‌క‌ర్గంలో టీడీపీకి బ‌లం ఉన్నా.. పార్ల‌మెంటు స్థాయిలో ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌లం అంతంత మాత్రంగానే ఉంది. దీంతో ఇక్క‌డ ఇటీవ‌లకాలంలో టీడీపీ త‌ర‌ఫున గెలుపు గుర్రం ఎక్కుతున్న నాయ‌కుడు ఎవ‌రూ లేరు. పైగా ఎప్పుడు అవ‌కాశం వ‌స్తే.. అప్పుడు పొత్తులో ఉన్న పార్టీకి చంద్ర‌బాబు ఈ టికెట్‌ను ఇచ్చేసి చేతులు దులుపు కొంటున్నారు. గ‌త ఏడాది ఎవ‌రితోనూ పొత్తు లేక‌పోవ‌డంతో పోటీకి దిగారు. ఇక‌, ఇప్పుడు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీంతో టికెట్ త‌మ‌కంటే.. త‌మ‌కంటూ.. ఇద్ద‌రు నాయ‌కులు ముందుకు వ‌చ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

కానీ, చంద్ర‌బాబు ఈ ప‌రిణామాన్ని రెండు విధాల ల‌బ్ధి పొందేందుకు ఉప‌యోగించుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఒక‌టి సెంటిమెంటు రూపంలో రాజ‌కీయాల‌ను పండించ‌డం. రెండు.. కేంద్రంలోని బీజేపీకి ద‌గ్గ‌ర కావ‌డం. సిట్టింగ్ నేత ఎవ‌రైనా మృతి చెందితే.. వారి కుటుంబంలోని వారికి టికెట్ ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. దీనికి ఇత‌ర ప‌క్షాలు కూడా దూరంగా ఉంటున్నాయి. రాజ‌కీయ వైర‌ధ్యాలు ఎన్ని ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీలు ఈ విష‌యంలో క‌లిసి ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఎలాగూ త‌మ‌కు బ‌లం లేదు కాబ‌ట్టి.. పోటీ పెట్ట‌డం మానేసి.. సెంటిమెంటుకు వాల్యూ ఇస్తున్నాం.. అని చంద్ర‌బాబు ప్ర‌క‌టించుకునేందుకు ప్ర‌య‌త్నించే అవ‌కాశం ఉంది.

అదే స‌మ‌యంలో ఎలాగూ అంతో ఇంతో త‌మ‌కు ఊపు ఉంద‌ని భావిస్తున్న బీజేపీ అభ్య‌ర్థిని నిల‌బెడితే..(గ‌తంలో బీజేపీ అభ్య‌ర్థులు గెలిచారు) వారికి లోపాయికారీగా .. టీడీపీ నుంచి స‌పోర్టు చేయాల‌ని బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అంటే.. ఇటు సెంటిమెంటు ద్వారా సింప‌తి సంపాయించుకునేందుకు, అటు లోపాయికారీగా .. బీజేపీకి మ‌ద్ద‌తివ్వ‌డం ద్వారా.. ఆ పార్టీకి చేరువ అయ్యేలా సంకేతాలు పంపేందుకు ఇది దోహ‌ద ప‌డుతుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ని టీడీపీలో గుస‌గుస వినిపిస్తోంది. అంటే.. ఒకే ఉప ఎన్నిక‌ను త‌న‌కు అనుకూలంగా రెండు విధాలా వాడుకునేందుకు బాబు వేసిన ఐడియా బాగుంద‌నే అంటున్నారు త‌మ్ముళ్లు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.