ఏపీలోని మందుబాబులకు హైకోర్టు గుడ్ న్యూస్

ప్రతిపక్ష నేతగా తన పాదయాత్ర సందర్భంగా ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం విధిస్తానని ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చెప్పిన విధంగానే జగన్….ఏపీలో దశలవారీగా మద్యపాన నిిషేధం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో మద్యం షాపుల సంఖ్యను తగ్గించడం, మద్యం ధరలను భారీగా పెంచడం…కొన్ని బ్రాండ్ల మద్యాన్నే అమ్మడం వంటి చర్యలు చేపట్టారు.

దీంతో, ఏపీలోని మందుబాబులకు పెద్ద చిక్కు వచ్చిపడింది. ఇక్కడ దొరికే బ్రాండ్లు తాగలేక….పొరుగు రాష్ట్రం తెలంగాణకు వెళ్లి మద్యం కొనలేక మందుబాబులు పరేషాన్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి ఏపీకి భారీగా మద్యం తరలించేందుకు కొందరు మందుబాబులు, షాపుల యజమానులు నానా తిప్పలు పడుతున్నారు.

ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలించే వారిని ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి మద్యం తరలింపుపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తీసుకుని వచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇతర రాష్ట్రాల నుండి ఒక వ్యక్తి గరిష్టంగా 3 మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి…ముఖ్యంగా తెలంగాణ నుంచి మద్యం తరలించేవారిపై అక్రమ మద్యం తరలిస్తున్నారంటూ పోలీసులు కేసులు పెట్టి బాటిళ్లను సీజ్ చేస్తున్నారు. అయితే, జీవో నెంబర్ 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఏపీ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తాజాగా కీలక తీర్పు నిచ్చింది. ఇతర రాష్ట్రాల నుండి ఏపీలోకి ఒక వ్యక్తి 3 మద్యం బాటిళ్లు తీసుకురావచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. జీవో నెంబర్ 411ను అమలు చేయాలని సూచించింది తాజాగా హైకోర్టు తీర్పుతో ఏపీలోని మందుబాబులకు ఊరట లభించినట్లయింది. మరోవైపు, హైకోర్టు తాజా తీర్పుతో ఇప్పటివరకు దాఖలైన అనేక కేసుల్లో ఏపీ సర్కార్ కొన్ని న్యాయపరమైన చిక్కులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.