రూ.5 ముఖవిలువ ఉన్న షేరుకు 19480శాతం డివిడెండ్!

నిజంగా నిజం. నమ్మలేని వాస్తవం. ఒక షేరు విలువకు ఏకంగా 19480 శాతం మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించిన ఒక టెక్నాలజీ కంపెనీ సంచలనంగా మారింది. ఎప్పుడైనా.. ఏ కంపెనీ అయినా ఇంత భారీగా డివిడెండ్ ప్రకటించిందా? అనిపించేలా ఉన్న ఈ షేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ కంపెనీ పేరేమిటి? అది అందించే సేవలు ఏమిటి? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట వినిపిస్తోంది. స్టాక్ మార్కెట్ ను విస్మయానికి గురి చేసిన ఈ షేరు ఇప్పుడు పెను సంచలనం.

మెజెస్కో లిమిటెడ్. మొన్నటివరకు ఈ పేరు చాలామంది విని ఉండరు. కానీ.. ఆ కంపెనీ తీసుకున్న ఒక నిర్ణయం స్టాక్ మార్కెట్ పరిచయం ఉన్న ప్రతిఒక్కరు.. ఔరా అని అనుకునేలా చేసింది. దీనికి కారణం ఆ కంపెనీ తన షేరు విలువకు ఏకంగా 19480శాతం మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించటమే. మరింత వివరంగా చెప్పాలంటే సదరు షేరు ముఖ విలువ కేవలం రూ.5 మాత్రమే. అయితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2020-21) మధ్యంతర డివిడెండ్ పేరుతో రూ.974ను ప్రకటించింది. అంతేకాదు.. ఈ డివిడెండ్ చెల్లింపునకు డిసెంబరు 25ను రికార్డు డేట్ గా ఫిక్స్ చేసింది.

ఈ కంపెనీకి చెందిన 2.9 కోట్ల షేర్లు మార్కెట్లో ఉన్నాయి. తాజాగా ప్రకటించిన మధ్యంతర డివిడెండు కింద కంపెనీ రూ.2788.40 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి రావొచ్చు. ఇదంతా జరిగినతర్వాత కూడా ఆ కంపెనీ చేతిలో ఇంకా రూ.100 కోట్ల విలువైన భూములు ఉండటం గమనార్హం. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఈ కంపెనీ తన వ్యాపార కార్యకలాపాల్ని పూర్తిగా నిలిపివేసే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

అందుకే.. కంపెనీ ఖాతాలో ఉన్న సొమ్మును వాటాదార్లకు డివిడెండ్ రూపంలో పంచి పెడుతున్నట్లుగా తెలస్తోంది. డివిడెండ్ ప్రకటనతో మంగళవారం మెజెస్కో షేరు మార్కెట్ లో దూసుకెళ్లింది. ఒక దశలో 5శాతం పెరిగి రూ.1019 వద్దగరిష్ఠ మొత్తానికి ట్రేడ్ అయ్యింది. చివరకు రూ.982.20 వద్ద క్లోజ్ అయ్యింది. ఈ రోజు ఈ షేరు మరింతగా దూసుకెళుతుందన్న అభిప్రాయాన్ని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంచనా ఏ మేరకు నిజమవుతుందో చూడాలి.