నెట్టింట్లో రెహ్మాన్ ను కూడా వదలట్లేదుగా..

నువ్వు ఆస్కార్ గెలవాలంటే బాగా కష్టపడి నీ తెలివంతా వాడి దానికి సృజనాత్మకతను జోడించి ఒక గొప్ప వర్క్ ఏదన్నా క్రియేట్ చేయాలేమో.. కాని మేం మాత్రం 26 అక్షరాలు ఒక జియో సిమ్ అండ్ చిన్న స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. నిన్ను ఏకేస్తాం.. అంటున్నారు కొందరు నెటిజన్లు. చివరకు అంతటి లెజెండ్ ను కూడా ఇప్పుడు పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. చిన్మయి వంటి సింగర్లు విస్తుపోతున్నారు.

సుశాంత్ సింగ్ ఆఖరి చిత్రం దిల్ బేచరా ను ప్రమోట్ చేయడానికి ఏ.ఆర్.రెహ్మాన్ కూడా ఇంటర్యూలు ఇచ్చాడు. అందులో భాగంగా.. మీరు బాలీవుడ్ సినిమాలు చేయట్లేదేంటి అని అడిగితే.. నాకు కథ నచ్చితే ఏ సినిమా అయినా చేస్తానని, కాని చిన్న సినిమాలను రెహ్మాన్ తొక్కేస్తున్నాడని ఒక గ్యాంగ్ రూమర్లు పుట్టించడంతో చాలామంది తన దగ్గరకు రావట్లేదని, ఒకవేళ వచ్చి కథతో ఇంప్రెస్ చేస్తే దిల్ బేచరా సినిమాకు ఇచ్చినట్లే అద్భుతమైన ట్యూన్లను ఇస్తానని రెహ్మాన్ చెప్పాడు.

ఇదంతా బాగానే ఉంది కాని, ఈ యవ్వారంపై కామెంట్ చేసిన దర్శకుడు శేఖర్ కపూర్.. ‘నీకు ఆస్కార్ వచ్చాక, నువ్వు బాలీవుడ్ కంటే టాప్ స్ఠాయిలో ఉన్నావని వాళ్ళకు తెలుసు, అందుకే నీకు వాళ్లు అవకాశాలు ఇవ్వట్లేదు’ అంటూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ ను రెహ్మాన్ స్వయంగా కొట్టిపాడేసినా, నెటిజన్లు మాత్రం ఈ స్వరాల మాంత్రికుడ్ని ఎక్కేస్తున్నారు.

‘ఏంటి రెహ్మాన్.. నువ్వు కూడా చివరకు సుశాంత్ మరణానితో ఫ్యామస్ అవుదామని చూస్తున్నావా? దక్షిణాదిలో అవకాశాలు కరువైపోయాయ్ కాబట్టి ఇలా బాలీవుడ్ ను గిల్లడం న్యాయమా?’ అంటూ ఒక పెద్దావిడ ట్వీటేసింది. అవాక్కయిన సింగర్ చిన్మయి, ”ఏవండి అవతల ఉంది రెహ్మాన్ అని తెలిసినా కూడా.. ఇలాంటి కామెంట్లు చేస్తారా?” అంటూ బాధపడింది. నిజమేగా.. నెట్టింట్లో ఈ ట్రాలర్లు ఎప్పుడన్నా అవతల వ్యక్తి స్థాయిని గౌరవించారేంటి? ట్వీటేస్తే ఫ్యామస్ అవుతాం అంటే ఎవరిమీదైనా సరే ఏదొ ఒకటి రాసేస్తాం అంతే.