టీడీపీ మెడకే చుట్టుకుంటున్న బహిష్కరణ అస్త్రం

Chandrababu

ఏ ముహూర్తంలో పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారో తెలీదు. అయితే నిర్ణయం తీసుకన్న దగ్గర నుండి చాలా విషయాలు పార్టీ మెడకే చుట్టుకుంటున్నాయి. తమ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొందరు నేతలు లెక్కచేయలేదు.

పరిషత్ ఎన్నికలకు నామినేషన్లు వేసిన వారిలో కొందరు పోటీ చేయాల్సిందే అనటంతో పై జిల్లాలోని సీనియర్ నేతలు ప్రచారం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో చంద్రబాబు ఆదేశాలను కొందరు సీనియర్లే బేఖాతరు చేస్తున్నట్లయ్యింది. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే వచ్చేనెలలలో పెండింగ్ లో ఉన్న స్ధానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమీషన్ రెడీ అవుతోంది.

పెండింగ్ లో ఉన్న ఎన్నికలంటే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు వేసిన 116 మంది మరణించారు. వివిధ కారణాలతో 8 జడ్పీటీసీ, 288 ఎంపిటీసీ స్ధానాలకు ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. అలాగే 276 పంచాయితీలకు ఎన్నికలు జరగాల్సుంది. అలాగే 3 మున్సిపల్ కార్పొరేషన్లు, 32 మున్సిపాలిటిలకు ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి.

వీటన్నింటికీ వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించేయాలని కమీషన్ కసరత్తు మొదలుపెట్టింది. ఈనెల 8వ తేదీన జరగబోయే పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తారు సరే మరి వచ్చే నెలలలో జరగబోయే పెండింగ్ ఎన్నికల మాటేమిటి ? వాటిని కూడా బహిష్కరిస్తారా ? ఆ విషయంలో పార్టీలోని సీనియర్ నేతలకే సరైన క్లారిటిలేదు.

మూడు రోజుల్లో జరగబోతున్న పరిషత్ ఎన్నికల బహిష్కరణనే కొందరు సీనియర్లు పట్టించుకోలేదు. అలాంటిది వచ్చే నెలలలో జరగబోయే పెండింగ్ ఎన్నికల విషయంలో చంద్రబాబు ఆదేశాలను పట్టించుకుంటారా ? నిజానికి ద్వితీయశ్రేణి నేతల సత్తా బయటపడేది, గ్రౌండ్ మండల, గ్రామస్ధాయిలో పార్టీ పటిష్టంగా ఉండాలంటే ఎన్నికల్లో పాల్గొనటమే ఏకైక మార్గం.

ఇలాంటి ఎన్నికల ద్వారానే గట్టి నాయకత్వం తయారవుతుందన్న చిన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయారు. పార్టీలోని చాలామంది సీనియర్ నేతలు ఇలాంటి ఎన్నికల ద్వారానే వెలుగులోకి వచ్చారు. మొత్తానికి బహిష్కరణ అస్త్రం చివరకు చంద్రబాబు మెడకే చుట్టుకునేట్లుంది.