మోహన్ బాబు హీరోగా సినిమా మొదలైంది

తెలుగు సినిమా సరిగా ఉపయోగించుకోలేకపోతున్న గొప్ప నటుల్లో మోహన్ బాబు ఒకరు. ఆయన నటనా కౌశలం గురించి, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి, డైలాగ్ డెలివరీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా.. బహుముఖ పాత్రలతో తన ప్రత్యేకతను చాటుకున్నారాయన. మూడు దశాబ్దాల పాటు విరామం లేకుండా ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలతో మెరిశారాయన. ఏకబిగిన 500కు పైగా సినిమాల్లో నటించారు.

కానీ గత దశాబ్ద కాలంలో మోహన్ బాబు సినిమాలు బాగా తగ్గించేశారు. ఎప్పుడో ఒకసారి సొంత బేనర్లో సినిమా చేస్తున్నారు తప్పితే.. బయటి చిత్రాల్లో అస్సలు నటించడం లేదు. చివరగా ఆయన సొంత సంస్థలో ‘గాయత్రి’ అనే సినిమా చేశారు. అది దారుణమైన ఫలితాన్నందుకుంది. అప్పట్నుంచి తెలుగులో మరో సినిమా చేయలేదు. తమిళంలో మాత్రం సూర్య చిత్రం ‘సూరారై పొట్రు’లో నటించారు. మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ చేస్తున్నారు.

ఐతే తెలుగులో చాలా విరామం తర్వాత మోహన్ బాబు ఒక సినిమా మొదలుపెట్టారు. ఆ సినిమా పేరు.. సన్ ఆఫ్ ఇండియా. ఇంతకుముందు మోహన్ బాబు బేనర్లో కొన్ని సినిమాలకు రచన చేసిన డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకుడు. అతను దర్శకుడిగా మారి ‘బుర్రకథ’ అనే సినిమా చేశారు కానీ అది ఆడలేదు. ఇప్పుడు మోహన్ బాబు కోసం ఒక పవర్ ఫుల్ కథ రెడీ చేశాడు.

విశేషం ఏంటంటే.. ఈ ‘సన్ ఆఫ్ ఇండియా’ స్క్రిప్టులో మోహన్ బాబుకూ భాగం ఉంది. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాసింది ఆయనే. ఎప్పట్లాగే సొంత బేనర్లోనే మోహన్ బాబు ఈ సినిమా చేస్తున్నారు. శంషాబాద్‌లోని మోహన్ బాబు ఇంటిలో శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనున్నారు. ఏకబిగిన సినిమాను పూర్తి చేయనున్నారు. మరి ఈ సినిమాతో అయినా మోహన్ బాబు బౌన్స్ బ్యాక్ అయి టాలీవుడ్లో నటుడిగా బిజీ అవుతారేమో చూడాలి.