కాళ్లు ప‌ట్టుకున్నావంటూ ఘాటు వ్యాఖ్య‌ల‌తో కిర‌ణ్ లైన్లోకి

న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి గుర్తున్నారా? ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చివ‌రి ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన ఆయ‌న ఇప్పుడు బీజేపీలో కొన‌సాగుతున్నారు. ఏపీలోని రాజంపేట లోక్‌స‌భ స్థానం నుంచి టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచారు. ఇన్ని రోజులూ సైలెంట్‌గా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు ఒక్క‌సారిగా సెన్సేష‌న‌ల్ కామెంట్ల‌తో లైన్లోకి వ‌చ్చారు. వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై కిర‌ణ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు.

రాజంపేట లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో సిటింగ్ ఎంపీగా పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి త‌న‌యుడు మిథున్ రెడ్డి ఉన్నారు. ఆయ‌న మ‌రోసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి.. కిర‌ణ్‌కు ప్ర‌ధాన రాజ‌కీయ శ‌త్రువుగా మారారు. ఇక్క‌డ విజ‌యం కోసం పోరాడుతున్న కిర‌ణ్ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని, మిథున్‌రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకుని మాట‌ల‌తో రెచ్చిపోతున్నారు. మిథున్ త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్న రామ‌చంద్రారెడ్డి.. కిర‌ణ్ టార్గెట్గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోనియా గాంధీ కాళ్లు ప‌ట్టుకుని సీఎం ప‌ద‌వి తెచ్చుకున్నార‌ని, జ‌గ‌న్‌ను జైలుకు పంపార‌ని కిర‌ణ్‌ను ఉద్దేశించి పెద్దిరెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్య‌ల‌కు కిర‌ణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. ప‌ద‌వుల కోసం తాను ఎవ‌రి కాళ్లు ప‌ట్టుకోలేద‌ని, గ‌తంలో డీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం గెస్ట్‌హౌస్‌కు వ‌చ్చి పెద్దిరెడ్డి త‌న కాళ్లు ప‌ట్టుకున్నార‌ని కిర‌ణ్ తెలిపారు. దీనిపై ఎక్క‌డైనా ప్ర‌మాణం చేస్తాన‌ని స‌వాల్ విసిరారు.

గ‌తంలో చిత్తూరు జిల్లాలో న‌ల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ ఉండేది. కానీ ఆ త‌ర్వాత రామ‌చంద్రారెడ్డి, కిర‌ణ్ ఇద్ద‌రూ కాంగ్రెస్ పార్టీలో క‌లిసి ప‌ని చేశారు. ఆ త‌ర్వాత పెద్దిరెడ్డి వైసీపీలోకి వెళ్లిపోగా.. ఇటీవ‌ల కిర‌ణ్ బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడీ లోక్‌స‌భ ఎన్నిక‌ల కార‌ణంగా ఈ ఇద్ద‌రి మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ మ‌ళ్లీ మొద‌లైంది.