యూపీ ఎన్నికల బరిలో తెలుగు మహిళ

ఉత్తరప్రదేశ్ లోక్ సభ ఎన్నికలలో జౌన్ పూర్ స్థానం నుండి బీఎస్పీ తరపున బరిలోకి దిగిన తెలుగు మహిళ శ్రీ కళారెడ్డి కలంకలం రేపుతున్నారు. ఆమె గతంలోనే 2004లో కోదాడ నుండి టీడీపీ తరపున, 2019లో బీజేపీ నుండి హజూర్ నగర్ నుండి బరిలోకి దిగుతారని ఊహాగానాలు వినిపించాయి. తాజాగా యూపీలో తన భర్త ధనుంజయ్ సింగ్ కు జైలు శిక్ష పడడంతో ఆమె బరిలోకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి కీసర జితేందర్ రెడ్డి ఏకైక కుమార్తె శ్రీ కళారెడ్డి. ప్రముఖ నిప్పో బ్యాటరీల కంపెనీ వీరి కుటుంబానిదే కావడం విశేషం. చెన్నై కేంద్రంగా వ్యాపారం నేపథ్యంలో శ్రీ కళారెడ్డి ఇంటర్మీడియట్ అక్కడే చదివింది. ఆ తర్వాత హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేసి యూఎస్ లో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చదివింది. 2017లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో యూపీకి చెందిన మాజీ ఎంపీ ధనుంజయ్ సింగ్ మూడో భార్యగా వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య ఆత్మహత్య చేసుకోగా రెండో భార్యకు విడాకులు ఇచ్చాక శ్రీకళారెడ్డిని మూడో భార్యగా స్వీకరించాడు.

2021లో జౌన్ పూర్ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికై జడ్పీ చైర్మన్ గా శ్రీ కళారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టింది. కిడ్నాప్, అక్రమ వసూళ్ల కేసులో ధనుంజయ్ సింగ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో బీఎస్పీ శ్రీ కళారెడ్డిని బరిలోకి దింపింది. బీజేపీ, ఎస్పీలను తట్టుకుని ఆమె ఎంత వరకు నిలబడుతుందో అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే శ్రీకళారెడ్డి పేరు మీద రూ.780 కోట్ల స్థిరాస్తులు, రూ.6.71 కోట్ల చరాస్తులు, 1.74 కోట్ల ఆభరణాలు ఉండగా, భర్త ధనుంజయ్ సింగ్ పేరు మీద రూ.5.31 కోట్ల స్థిరాస్తులు, రూ.3.56 కోట్ల చరాస్తులు మాత్రమే ఉండడం గమనార్హం.