వారసులు హిట్టా ? ఫట్టా ?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న రాజకీయ వారసులు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారా ? లేక ఓటమి పాలవుతారా ? అన్న చర్చ జోరుగా సాగుతున్నది. యువతకు అవకాశాలు ఇవ్వాలని, విద్యాధికులను పార్టీ తరపున అవకాశం ఇచ్చినట్లు ఉండాలన్న ఉద్దేశంతో పాటు మహిళా కోటా బయటకు చూయించడానికి అక్కడక్కడా టికెట్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలలో వీరి గెలుపు మీద ఆసక్తి నెలకొన్నది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు క్రిష్ణమూర్తి, రామచంద్రాపురం ఎమ్మెల్యే పిల్లి సుభాష్ కుమారుడు సూర్యప్రకాష్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె ఫాతిమాకు వైసీపీ అవకాశం ఇచ్చింది. గుంటూరు, బందరు మినహాయిస్తే చంద్రగిరి, తిరుపతి, రామచంద్రాపురంలలో పరిస్థితులు ఆశాజనకంగా లేవని తెలుస్తున్నది.

ఇక తెలుగుదేశం పార్టీ నుండి కోవూరు నుండి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డికి, ప్రత్తిపాడు నుండి ఇటీవల మరణించిన వరపుల రాజా సతీమణి సత్యప్రభకు, వెంకటగిరి నుండి మహిళాకోటాలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామక్రిష్ణ కుమార్తె లక్ష్మీప్రియకు, శ్రీకాళహస్తి నుండి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి, కమలాపురం నుండి పుత్తా నరసింహారెడ్డి కుమారుడు చైతన్యరెడ్డికి, పుట్టపర్తి నుండి పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరరెడ్డికి, కదిరి నుండి మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ సతీమణి యశోదాదేవికి అవకాశం ఇచ్చారు. వారసులకు టికెట్ వచ్చిందని నాయకులు సంతోషంగా ప్రచారంలో దూసుకుపోతున్నా ప్రజలు వీరిని ఎంతవరకు ఆదరిస్తారు ? పార్టీల ప్రయోగాలు ఎంత వరకు ఫలిస్తాయి ? అన్నది వేచిచూడాలి