జగన్‌పై రాయి కేసులో ట్విస్ట్


ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రాజకీయం మూడు రోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి చుట్టూనే తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ దాడిని ఖండిస్తూనే కోడి కత్తి లాంటి వ్యవహారాలను తెరపైకి తీసుకొచ్చి సీఎంపై రాయి దాడి విషయంలో సందేహాలు వ్యక్తం చేశాయి ప్రతిపక్షాలు. మరోవైపు వైసీపీ ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ఎంత చేయాలో అంతా చేస్తోంది. పేదవాళ్ల కోసం పోరాడుతున్న జగన్ మీద పెత్తందారుల దాడి అంటూ హెడ్డింగ్స్ పెట్టి ఆయనకు ఎలివేషన్ ఇస్తున్నారు అనుకూల మీడియా, సోషల్ మీడియా జనాలు.

ఐతే జగన్ మీద రాయి దాడి స్టంట్ కాదు నిజం అనుకుందామన్నా, ఇంతకీ ఈ విషయంలో భద్రతా వైఫల్యం మాటేంటి.. రాయి ఎవరు విసిరారో పోలీసులు ఎందుకు కనిపెట్టలేకపోయారు అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి.

కాగా ఇప్పుడు ఈ కేసులో పురోగతి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు రాయి దాడి విషయంలో అయిదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారట. అందులో సతీష్ అనే కుర్రాడు కూడా ఉన్నాడని.. అతనే సీఎం మీదికి రాయి విసిరాడని అంటున్నారు.

ఐతే రాయి విసరడానికి కారణం గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర రూమర్ తిరుగుతోంది. సీఎం రోడ్ షోకు హాజరైతే క్వార్టర్ మందు, రూ.350 డబ్బులు ఇస్తారని పిలిచారని.. ఐతే అక్కడికి వచ్చాక మందు సీసా మాత్రమే ఇచ్చారని.. డబ్బులు ఇవ్వలేదని ఈ కోపంతోనే సీఎం మీదికి రాయి విసిరానని సదరు యువకుడు చెప్పినట్లుగా సోషల్ మీడియాలో జోరుగా ఓ వార్త తిరుగుతోంది. ఇది నిజమా కాదా అన్నది పోలీసులు అధికారిక ప్రకటన చేసే వరకు తెలియదు. ఇదే నిజమైతే మాత్రం ప్రతిపక్షాలు కుట్ర పూరితంగా రాళ్ల దాడి చేయించారని ఆరోపిస్తున్న వైసీపీకి గతుక్కుమన్నట్లే.