ముఖ్యమంత్రి లాకప్ పాలన షురూ

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ చేత అరెస్టు అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తనదైన తీరును ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. కారణం ఏదైనా అరెస్టు అయినంత మాత్రాన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్న అంశం రాజ్యాంగంలో లేని నేపథ్యంలో తాను జైలు నుంచే పాలన చేస్తానంటూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ నిర్ణయం తర్వాత ఇది సాధ్యమా? అంటూ నిబంధనల్ని సరి చూడగా.. సాధ్యమేనన్న సమాధానం వచ్చింది.

ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఆయన కస్టడీ నుంచే తన పాలనను షురూ చేశారు.ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఢిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. జైలు నుంచి పాలనకు కాస్త భిన్నంగా ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఆయన లాకప్ పాలన షురూ చేశారని చెప్పాలి. ఢిల్లీ మద్యం స్కాంలో విచారణకు తమ ఎదుట హాజరు కావాలంటూ ఈడీ పలుమార్లు సమన్లు పంపింది. అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం వాటికి స్పందించలేదు.

ఈ నేపథ్యంలో ఆయన్ను మార్చి 21న అరెస్టు చేయటం.. అనంతరం ఆయన్ను కస్టడీలోకి తీసుకోవటం తెలిసిందే. అరెస్టు వేళలోనే ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఆయన్ను కోర్టు ఎదుట హాజరుపర్చగా ఆయనకు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అయినప్పటికీ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయని కేజ్రీవాల్.. తాను జైలు నుంచి పాలన చేస్తానని పేర్కొన్నారు.

తాను కనుక అరెస్టు అయితే.. జైలు నుంచి పాలన సాగించేందుకు ఏ చట్టమూ తమను అడ్డుకోలేదన్న కేజ్రీవాల్.. అందుకు తగ్గట్లే చేతల్లో చూపిస్తున్నారు. ఆయనపై చేసిన ఆరోపణలు రుజువు కాలేదని.. అందుకే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నట్లుగా కేజ్రీ మంత్రివర్గంలోని మంత్రి అతిశీ మార్లీనా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. ఈడీ లాకప్ నుంచి ముఖ్యమంత్రి హోదాలో తొలి ఆదేశాన్ని జారీ చేసినట్లు చెబుతున్నా.. అధికారికంగా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇదిలా ఉంటే ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ ఉమేశ్ సైగల్ మాట్లాడుతూ.. జైలు నుంచి ముఖ్యమంత్రి పాలన సాగించటం సాధ్యం కాదని పేర్కొన్నారు. జైలు మాన్యువల్ ప్రకారం ఒక వ్యక్తి జైలు లోపల నుంచి ప్రభుత్వాన్ని నడపటానికి అనుమతించదని స్పష్టం చేసిన నేపథ్యంలో తర్వాతి రోజుల్లో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.