తన ఆరోగ్యంపై శ్రుతి క్లారిటీ.. కౌంటర్లు


శ్రుతి హాసన్.. ఈ సంక్రాంతికి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న కథానాయిక. ఈ పండక్కి తెలుగులో రిలీజైన రెండు భారీ చిత్రాల్లోనూ ఆమే కథానాయిక కావడం విశేషం. ఐతే ఆ రెండింట్లో ఒక సినిమా అయిన ‘వీరసింహారెడ్డి’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన శ్రుతి.. ఆ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ వేడుకలో పాల్గొనకపోవడం చర్చనీయాంశం అయింది. శ్రుతికి జ్వరం వచ్చిందని చెబుతూ.. ఆమె ఏం తిందో, తనను ఎవరైనా బెదిరించారేమో తెలియదు అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యల మీదా చిన్న స్థాయి దుమారం రేగింది. ఈ కౌంటర్ బాలయ్యను ఉద్దేశించే చిరు వేశాడన్న చర్చ జరిగింది.

ఆ సంగతి అలా ఉంచితే.. శ్రుతి మెంటల్ హెల్త్ సరిగా లేదని, అందుకే ఆమె ‘వాల్తేరు వీరయ్య’ వేడుకకు దూరంగా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ రూమర్లపై శ్రుతి తాజాగా స్పందించింది. తాను వైరల్ ఫీవర్ వల్ల కొంత ఇబ్బంది పడ్డానని, అంతకుమించి ఏమీ లేదంటూ తన గురించి ఊహాగానాలు ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్ వేసింది శ్రుతి.

“నేను కేవలం వైరల్ ఫీవర్ వల్ల ఇబ్బంది పడుతున్నానంతే. నన్ను కావాలనే కొంతమంది ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. నేను ఎప్పుడూ మానసికంగా బలంగా ఉంటాను. అన్ని విధాలుగా నన్ను నేను కాపాడుకుంటాను. నన్ను కావాలనే ఇబ్బంది పెట్టాలని కొంతమంది ప్రయత్నించారు. వాళ్లు మానసిక సమస్యలతో బాధ పడుతుంటే.. వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. ఇలా కొంతమందిని టార్గెట్ చేస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం, వ్యవహారాన్ని డ్రమటిగ్గా మార్చడం వల్లే చాలామంది మెంటల్ హెల్త్ సమస్యను బయటపెట్టడానికి భయపడుతుంటారు” అని శ్రుతి పేర్కొంది.

మొత్తానికి తన గురించి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం విషయంలో శ్రుతి బాగానే హర్టయినట్లు కనిపిస్తోంది. శ్రుతి నటించిన ‘వీరసింహారెడ్డి’; ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు రెంటికీ డివైడ్ టాక్ ఉన్నప్పటికీ.. అవి రెండూ మంచి ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తున్నాయి.