సత్యదేవ్ ఇంకొంచెం ఆగాల్సింది

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత బజ్ లేదు. ఏపీలో రాజకీయాల పట్ల జనం విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు.

అధికార వైసిపి ప్రచారానికి ధీటుగా టీడీపీ జనసేన కూటమి పబ్లిక్ లోకి బలంగా చొచ్చుకుపోవడంతో పరిణామాలు థ్రిల్లర్ మూవీని మించి జరుగుతున్నాయి. ఇంకో వైపు మే 13 పోలింగ్ తేదీ ముంచుకు వస్తోంది.

ఇది ఒక్క రోజు హడావిడని కొట్టిపారేయడానికి లేదు. హైదరాబాద్ తో సహా చాలా ఊళ్లలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవడం కోసం స్వంత ఊళ్లు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు.

అంతే రెండో శనివారం, సండే, సోమవారం ఓటింగ్ వెరసి మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ హడావిడిలో అదే పనిగా థియేటర్లకు వెళ్లే మూడ్ లో ప్రేక్షకులు లేరన్నది వాస్తవం. అయితే కృష్ణమ్మ టాక్ నే నమ్ముకుంది.

కొరటాల శివ సమర్పకుడు కావడంతో ఆయన వైపు నుంచి పబ్లిసిటీ పరంగా ఎంత చేయాలో అంతా పూర్తి చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. రాజమౌళి గెస్టుగా వచ్చాడు.

ఇంత చేసినా అడ్వాన్స్ బుకింగ్స్ కనీస స్థాయిలో లేకపోవడం ఆందోళన కలిగించే విషయమే. మార్నింగ్ షో తర్వాత వచ్చే రెస్పాన్స్ ని బట్టే కౌంటర్ అమ్మకాలు ఆధారపడి ఉంటాయి.

అసలీ టెన్షన్ లేకుండా ఇంకొక్క వారం ఆగి ఉండాల్సిందని ట్రేడ్ అభిప్రాయపడుతోంది. అయితే మే 17 గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఉంది. విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన ఈ విలేజ్ డ్రామాని సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

ట్రయిలర్ వచ్చాక హైప్ అమాంతం పెరుగుతుందని టీమ్ బలంగా నమ్ముతోంది. దాంతో క్లాష్ అవ్వడం కన్నా ప్రతినిధి 2తో తలపడటమే సేఫ్ అని కృష్ణమ్మ బృందం భావించి ఉండొచ్చు. ఇది సక్సెస్ కావడం మీదే సత్యదేవ్ తర్వాతి సినిమాలు ఫుల్ బాటిల్, జీబ్రా, గరుడ చాప్టర్ వన్ బిజినెస్ ఆధారపడి ఉంది. చూడాలి ఏం చేయబోతున్నాడో.