సాయిపల్లవికి కళ్ళు చెదిరే పారితోషికం

సౌత్ ఇండియాలో గ్లామర్ ని ఎక్స్ పోజ్ చేయకుండా అందం అభినయం రెండూ చూపగల హీరోయిన్ ఎవరయ్యా అంటే ఒకప్పుడు సౌందర్య, ఇప్పుడు సాయిపల్లవినే గుర్తుకు వస్తోంది. వచ్చిన ఆఫర్లన్నీ ఒప్పుకోకుండా కేవలం కథ నచ్చితేనే ఎస్ చెప్పే ఈ ఫిదా భాగమతి ఒక టైంలో చిరంజీవికి చెల్లెలిగా భోళా శంకర్ ఆఫర్ ఇస్తే నో అనేసింది. రీమేకుల్లో నటించననే కండీషన్ పెట్టుకున్న కేరళ కుట్టి అది ఎంత మంచి నిర్ణయమో తర్వాత ఋజువు చేసింది. అయితే రెమ్యూనరేషన్ పరంగా ఇప్పటిదాకా సాయిపల్లవి భారీగా తీసుకున్న దాఖలాలు మల్లువుడ్ లోనూ అంతగా వినిపించలేదు.

అయితే రన్బీర్ కపూర్ సరసన సీతగా రామాయణంలో చేయబోయే పాత్ర కోసం ముప్పై కోట్లకు పైగా పారితోషికం ఇవ్వొచ్చనే టాక్ ముంబై మీడియాలో వినిపిస్తోంది. ఎలా చూసుకున్నా ఇది చాలా పెద్ద మొత్తం. దర్శకుడు నితీష్ తివారి ఈ ఎపిక్ ని మూడు భాగాలుగా తీస్తున్నారు. ఎంత టైం పడుతుందో చెప్పలేం. కనీసం మూడు నాలుగు సంవత్సరాలు అవసరమని యూనిట్ టాక్. అలాంటప్పుడు నటించే ప్రతి ఒక్కరు భారీగా కాల్ షీట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అంతకన్నా ఎక్కువ సమయం అవసరమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే సాయిపల్లవికి అంత మొత్తం ఇస్తారని వినికిడి.

ఒకవేళ ముప్పై కన్నా ఎక్కువైనా ఆశ్చర్యపోనక్కర్లేదని మరికొన్ని కథనాలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఇన్నేళ్లకు సాయిపల్లవి క్యాలిబర్ కు తగ్గ క్యారెక్టర్ దొరికిందని చెప్పాలి. సీతమ్మగా అంజలీదేవి నుంచి నయనతార దాకా ఎందరో ఆ పాత్రలో ఒదిగిపోయారు కానీ కొందరే మర్చిపోలేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడీ బాలీవుడ్ రామాయణం అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతోంది. సరిగ్గా కుదిరితే చరిత్రలో చోటు సంపాదించుకుంటుంది. యష్ రావణుడిగా, సన్నీ డియోల్ ఆంజనేయుడిగా, రకుల్ శూర్పానఖగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది కానీ యూనిట్ ఇంకా అఫీషియల్ చేయలేదు.