ద‌గ్గుబాటి.. వైసీపీ పొమ్మంది.. బీజేపీ ప‌క్క‌న పెట్టింది!!

అన్న‌గారు ఎన్టీఆర్ పెద్ద అల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, అన్న‌గారి కుమార్తె.. పురందేశ్వ‌రిలు.. రాజ‌కీయంగా అంద‌రికీ సుప‌రిచితులే. ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరులో టీడీపీని వేళ్లూనుకునేలా చేసింది వెంక‌టేశ్వ‌ర‌రావే. వ‌రుస విజ‌యాలు సాధించి.. రాష్ట్ర వ్యాప్తంగా చ‌క్రం తిప్పారు.

ఇక‌, ఆయ‌న స‌తీమ‌ణి.. పురందేశ్వ‌రి.. 2004లో బాప‌ట్ల పార్ల‌మెంటు స్థానం నుంచి, 2009లో విశాఖ పార్ల‌మెంటు స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై విజ‌యంసాధించి.. కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు. ఇలా ఒక వెలుగు వెలిగిన ఈ దంప‌తులు.. ఇద్ద‌రూ.. ఇప్పుడు ఏకంగా రాజ‌కీయాల‌కు దూరం కానున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయో చెప్ప‌లేని ప‌రిస్థితులు వ‌స్తాయి. అలాంటివే ఇప్పుడు ద‌గ్గుబాటి ఫ్యామిలీలోనూ చోటు చేసుకున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌నే తీసుకుంటే.. ఆ ఎన్నిక‌ల్లో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు.. త‌న కుమారుడు చెంచురామ్‌ను వైసీపీ త‌ర‌పున ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయించాల‌ని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయ‌నే రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ.. ఆయన గ‌తంలో ఉన్న ప్ర‌భావాన్ని చూపించ‌లేక పోయారు. ఫలితంగా ఓడిపోయారు. ఇక‌, అప్ప‌టి నుంచి కూడా ఆయ‌న పార్టీకి దూరంగా ఉంటున్నారు.

స‌రే.. పార్టీకి దూరంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రూ ఏమీ అన‌లేదు. కానీ, కాంగ్రెస్ నుంచి 2014లో బీజేపీలోకి వ‌చ్చి.. రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసి, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో విశాఖ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పురందేశ్వ‌రి.. వైసీపీ స‌ర్కారును టార్గెట్ చేయ‌డం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లే చేశారు. మ‌రి ఈ సంద‌ర్భంగా స‌తీమ‌ణి వ్యాఖ్య‌ల‌ను తిప్ప‌టికొట్టే ప్ర‌య‌త్నం చేయాల్సిన బాధ్య‌త వైసీపీ నాయ‌కుడిగా వెంక‌టేశ్వ‌ర‌రావుకు ఉంటుంది. కానీ, ఆయ‌న మాత్రం మౌనం పాటించారు. ఈ ప‌రిణామాల‌తో ఆయ‌న‌ను వైసీపీ అధిష్టానం ప‌క్క‌న పెట్టింది. ఇక్క‌డి ఇంచార్జ్ బాధ్య‌త‌ల‌ను కూడా ఆయ‌న‌ను నుంచి త‌ప్పించేసింది.

దీంతో వెంక‌టేశ్వ‌రరావు.. రాజ‌కీయంగా ఒంట‌రి అయ్యార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అదేస‌మ‌యంలో పురందేశ్వ‌రి.. బీజేపీలో ఓ వెలుగు వెల‌గాల‌ని అనుకున్నారు. రాజ్య‌స‌భ టికెట్‌ను ఆశించారు. అది ద‌క్క‌క పోయే స‌రికి రాష్ట్ర బీజేపీ ప‌గ్గాలు ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. అదీ ద‌క్క‌లేదు. అయితే, అవి ద‌క్క‌క పోవ‌డానికి కార‌ణం.. రాజ‌ధాని అమ‌రావ‌తిపై బీజేపీ నిర్ణ‌యానికి విరుద్ధంగా ఆమె వ్య‌వ‌హ‌రించార‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ఏదైతేనేం.. ఆమెకు ఆశించిన విధంగా పార్టీలో గుర్తింపు ల‌భించ‌లేదు.

ఇక‌, ఇటీవ‌ల పార్టీ రాష్ట్ర ప‌గ్గాలు చేప‌ట్టిన సోము వీర్రాజు కూడా పురందేశ్వ‌రిని ప‌క్క‌న పెట్టారు. పార్టీ రాష్ట్ర క‌మిటీలో పురందేశ్వ‌రికి ఏ ప‌ద‌వినీ క‌ట్ట‌బెట్ట‌లేదు.. స‌రిక‌దా.. ఆమె పేరు కూడా ఎక్క‌డా పేర్కొన‌లేదు. ఈ ప‌రిణామం.. నిజంగానే పురందేశ్వ‌రికి శ‌రాఘాతంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇలా.. ఈ దంప‌తుల‌కు అటు వైసీపీ, ఇటు బీజేపీ కూడా దూర‌మ‌య్యాయ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.