గంటాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన జగన్?

విశాఖ రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఆ మధ్యన జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగటం తెలిసిందే. నిజానికి ఎన్నికల ముందు నుంచే ఈ ప్రచారం షురూ అయ్యింది. ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రచారాన్ని ఖండిస్తున్న గంటా.. ఈ మధ్యన పార్టీకి.. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు వీలుగా అనుమతి లభించినట్లుగా సమాచారం. ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన గంటాకు విచిత్రమైన అలవాటు ఉంది. ఎప్పటికప్పుడు తన నియోజకవర్గాన్ని ఆయన మార్చేస్తుంటారు. సమయానికి తగ్గట్లుగా పార్టీ మార్చే విషయంలోనూ ఆయనకు పెద్దగా అభ్యంతరాలు లేవన్న మాట వినిపిస్తూ ఉంటుంది. దీనికి తగ్గట్లే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన తర్వాత టీడీపీలో చేరటం.. ఏ పార్టీలో ఉన్నా తనకు దక్కాల్సిన పదవుల్ని దక్కించుకోవటం ఆయనకున్న రాజకీయ చతురతకు నిదర్శనంగా చెబుతారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ మారటం ఖాయమన్న వాదన వినిపించింది. ఇందుకు విరుద్దంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత విజయసాయి గంటాను టార్గెట్ చేసేలా తరచూ ట్వీట్లు పోస్టు చేసేవారు. దీంతో.. ఆయన్ను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి లేదన్న విషయాన్ని పరోక్షంగా చెప్పినట్లుగా భావించేవారు. దీనికి కారణం లేకపోలేదు. జగన్ పార్టీకి చెందిన విశాఖ జిల్లా నేత అవంతి శ్రీనివాస్ కు.. గంటాకు ఏ మాత్రం పొసగదు.

దీంతో.. గంటాకు ఫ్యాన్ పార్టీలో చేరే ఛాన్సు లేదనే మాట బలంగా వినిపించింది. ఇటీవల కాలంలో గంటా కామ్ గా ఉండటం..టీడీపీ కార్యకలాపాల్లో పెద్దగా పాలు పంచుకోకపోవటం.. పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో తరచూ ట్వీట్లతో టార్గెట్ చేసే విజయసాయి సైతం గంటా మీద విమర్శలు చేయటం ఆపేశారు. మారిన రాజకీయంలో భాగంగా అధినేతకు గంటాను పార్టీలో చేర్చుకునే విషయంలో పెద్ద పట్టింపులు లేవన్న ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆయన్ను పార్టీలోకి తీసుకుంటారని చెబుతున్నారు.

ఇప్పటికే జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని.. సరైన టైం చూసుకొని పార్టీలోకి మారటమే మిగిలి ఉందంటున్నారు. మరీ ప్రచారంపై గంటా మౌనం చూస్తే.. జరుగుతున్న ప్రచారంలో అంతో ఇంతో నిజం ఉందన్న భావన కలుగక మానదు.